(గత సంచిక తరువాయి)
వైకల్యం లేనిదే కైవల్యం
కైవల్యం అంటే మోక్షం, మానవ జన్మకు అదే పరమార్ధమనీ అన్ని ఆధ్యాత్మిక సాధనలకూ అదే లక్ష్యమనీ మన పెద్దలు చెప్తున్నారు. అయితే, మోక్షంఅంటే జన్మ రాహిత్యమనీ అదేదో ప్రదేశమనీ తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చేసినవారు మరణానంతరం అక్కడికి చేరుకుంటారనీ సాధారణంగా అనుకుంటూ ఉంటాము. కాని అది ఒక ప్రదేశం కాదు. అది ఒక మానసిక స్థితి.
క్రమ సాధనతో దివ్యానంద మయమైన ఆ స్థితిని ఎవరైనా ఈ జీవిత కాలంలోనే సాధించవచ్చు. మనస్సు ఏ సన్నివేశంలోనూ వికలం కాకుండా తన కర్తవ్యం మీద, ఆరాధ్య దైవంమీద నిలకడగా ఉంటే, అందువల్ల కలిగే దివ్యానందమే కైవల్యం- అని గుర్తించ పచ్చు. ఆ స్థితిలో క్రుంగు పొంగులు ఉండవు.. ఆవేశమూ ఆవేదనా అందోళనా అన్నీ ‘తన’ అదుపులో ఉంటాయి.
రాగ ద్వేషాలకు అతీతమైన దివ్యప్రేమ ఒకటే నిరంతరం ఆ మనస్సులో ఉంటుంది. ఆ ప్రేమామృత ప్రవాహమే ఆ సాధకునినుండి అన్నివేళలా ప్రసార మవుతూ ఉంటుంది. అతడికి కర్తవ్యం ఉంటుంది కాని కలవరపాటు ఉండదు. మానవతా దృష్టి ఉంటుంది కాని మమకారం ఉండదు.
ఆత్మవిశ్వాసం ఉంటుంది కాని అహంకారం ఉండదు. అకళంకమైన అవ్యాజ ప్రేమ ప్రవాహంలో అతడి మనస్సు మునకలు వేస్తూ ఉంటుంది. ఇది ఏ విధమైన వికలత్వమూ లేని మానసిక స్థితి.
ఈ స్థితిని వివరిస్తూ అమ్మ చెప్పిన వాక్యం “వైకల్యం లేనిదే కైవల్యం”.
- (సశేషం)