అమ్మ “నేను నేనైన నేను” అని చెప్పింది. ఇందులో మూడు ‘నేను’లు ఉన్నాయి. వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? మొదట ‘నేను’ ‘అమ్మా! నువ్వు ఎవరివి – రాజరాజేశ్వరివా, లక్ష్మివా, పార్వతివా?’ అని అడిగితే అమ్మ ‘నేను’ అనే, ‘నేను’; రెండవ ‘నేను’ నేనైన బ్రహ్మాండం అనసూయ అయిన ‘నేను’; మూడవ ‘నేను’ అన్ని నేనులకు ఆధారమైనటువంటి పెద్ద ‘నేను’; అహం బ్రహ్మస్మిలోని బ్రహ్మ పదార్థం అయిన నేను. అదే అమ్మ.
అమ్మ “రూపం పరిమితం, శక్తి అనంతం” అన్నది. ఈ వాక్యం సృష్టిలోని ప్రతి వ్యక్తికి ప్రతివస్తువుకి అన్వయించునట్లుగానే అమ్మకి కూడా అన్వయిస్తుంది. అమ్మ పరిమితమైన రూపంలో ఉన్నప్పటికీ ఆమె శక్తి అనంతంగా వ్యాపించి ఉన్నది. Gorden Westerlund అనే ఆయన అమ్మను చూడలేదు. కానీ ‘అమ్మను నేను చూశాను’ అంటారు; ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ‘Garden of Flowers’ అని అమ్మను గురించి English లో Poetry వ్రాశారు. మంత్రాయి అనే ఆయన జిల్లెళ్ళమూడిలో పొలం దున్నేవాడట. అతడు పొలం దున్నుతూంటే నాగలిమీద అమ్మ కనిపించేదట. ఎట్లా కనిపించేది? అమ్మ ఏ చీర కట్టుకుందో పని అయ్యాక ఇంటికొచ్చి చూస్తే అమ్మ అక్కడ కనిపించిన చీరతోనే ఇక్కడ కనిపించేదట. ఈ శక్తి మంత్రాయిదీను, Gorden Westerlund దీ కాదు కదా! అమ్మదే అది. అందువల్ల పరిమితమైన రూపంలో ఉన్నా పరిమితమైన కాలంలో ఉన్నా అమ్మ శక్తి అనంతంగా అన్నికాలాలకి అన్ని దేశాలకి వ్యాపించి ఉంటుంది – విత్తనంబు మట్టి వృక్షంబునకు నెంత? అన్నట్లుగా.
అమ్మ మాటలన్నీ మంత్రాలే. మంత్రం అంటే మననం చేసుకునే కొద్దీ మనల్ని అది రక్షిస్తుంది. మన దుఃఖాల్ని పోగొడుతుంది. భవభూతి అనే కవి సంస్కృతంలో ‘ఉత్తరరామచరిత్ర’ అని ఒక నాటకం వ్రాశారు. ఆయన సీతాదేవి మాటల్ని వర్ణిస్తూ –
మానస్య జీవకుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియమోహనాని।
ఏతానితే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని॥
అన్నారు. అంటే ‘సీతాదేవి మాటలు వాడిపోయిన జీవన కుసుమాన్ని వికసింప జేస్తాయి, అన్ని ఇంద్రియాలకి సమ్మోహనశక్తిని ప్రసాదిస్తాయి, వీనుల విందుగా ఉంటాయి, మనస్సుకి మంచి బలవర్థక ఔషధం (Tonic) వంటివి అని. అలా అమ్మ మాటలు మనకి మంచి Tonic గా పనిచేస్తాయి. జీవితంలో వివిధ సందర్భాలలో ఉండేటటువంటి సంఘటనల్లో మనం సుఖదుఃఖాల్ని అను భవిస్తూంటాం. అలాంటప్పుడు అమ్మ మాటల్ని తలచుకుంటే ఆ మాటల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొంది ధైర్యం వస్తుంది. ఒకసారి అమ్మ “నా చరిత్ర చదివితే ఏం వస్తుంది నాన్నా!” అంటే ‘అమ్మా! నీ చరిత్ర చదివితే ధైర్యం వస్తుంది’ అన్నాను. అమ్మ మాటలన్నీ స్వీయ అనుభవసారమే.
“నీకిచ్చింది తృప్తిగా తిని ఇతరులకి ఆదరంగా పెట్టుకో – అన్నీ భగవంతుడే చేస్తున్నాడనుకో- ఇదే సుఖపడే మార్గం” అని చెప్పింది అమ్మ. సూత్రాలలో దళసార్ధక్యం అంటాం – అంటే అల్పాక్షరాలుగా ఉంటాయి అనల్పార్ధాన్ని ఇస్తాయి. ఇక్కడ – ‘నీవు’ అంటే after all. నీ కంటే తెలివైన వాళ్ళు, నీ కంటే డబ్బున్నవాళ్ళు నువ్వు పొందేటటువంటి సుఖాన్ని పొందకపోవచ్చు. నువ్వు ఒక పనిముట్టువి. ‘నీకు ఇచ్చింది’ – ఇది నేనే సంపాదించాను, నేనేదో ప్రయోజకుడ్ని గొప్పవాడ్ని అనుకుంటావు. అది నిజం కాదు. నీకు ఎవరో ఇస్తేనే వచ్చింది. నీకు ఇచ్చిందే అది; నువ్వు తెచ్చుకున్నదీ, నీ ప్రయోజకత్వం వలన సాధించుకున్నదీ కాదు. ఎందువల్ల? అంటే అది అందరికీ రావటం లేదు. అందువల్ల ‘నీకు ఇచ్చింది’. ‘తృప్తిగా తిని’ ఇచ్చిన దానిని తింటున్నాం గానీ తృప్తిగా తినటం లేదు. ‘అది లేదు – ఇది లేదు’ అనుకుంటూ అసంతృప్తి గానే ఉంటున్నాం. అలా కాదు. తృప్తిగా తిని అంటే అనుభవించి – ఇక్కడ Fullstop పెట్టేస్తున్నాం. తృప్తిగా తిని comma పెట్టి, ‘ఇతరులకు ఆదరంగా పెట్టుకో’ అని ఇంకొక మూడు మాటలు ఉన్నాయి. ‘ఇతరులు’ యదార్థంగా ఇతరులనేవారు ఎవరున్నారు? సత్యం ప్రకారం, తత్త్వం ప్రకారం చూసినట్లయితే ఇతరులు లేరు. ప్రపంచమంతా మనకి దర్పణం లాంటిది. మనమే నిండి ఉన్నాం ప్రపంచం అంతా. ‘యద్భావం తద్భవతి’; ‘భావోయం భావనా మాత్రం’. ఈ ప్రపంచంలో ఇతరులనే వాళ్ళు ఎవరూ లేరు. అందుచేత ‘ఇతరులకు’ అనేది మనం వ్యావహారికంగా మాట్లాడే మాటే గానీ వాళ్ళు ఇతరులు కాదు; నువ్వే. ‘ఇతరులకు ఆదరంగా పెట్టుకో” ‘ఆదరంగా’ – వాళ్ళకేదో సహాయం చేస్తున్నాను; నా సంపదను కొంత వాళ్ళకి ఇస్తున్నాను; దానం చేస్తున్నాను అనే భావాలు లేకుండా నీ కన్నబిడ్డలకి పెట్టినట్లుగా ‘పెట్టుకో’. పెట్టటం కాదు – ‘పెట్టుకో’; పెట్టుకోవటం నీ కోసం, వాళ్ళ కోసం కాదు. నువ్వు వాళ్ళకి చేసేది సేవే కానీ దానం కాదు అనే – భావన కలిగి ఉండాలి.
అన్నపూర్ణాలయంలో అన్నం తినటానికి ఎవరు అర్హులు అంటే “dress/ address బట్టి కాదు; ఆకలే అర్హత. ఆకలితో ఉన్నవాళ్ళకి ఆదరంగా అన్నం పెట్టండి” అన్నది అమ్మ. ఒకసారి అమ్మ సన్నిధిలో ‘గాయత్రీయాగం’ చేశారు. అందులో పాల్గొనటానికి ఎవరు అర్హులు ? అంటే “ఆసక్తే అర్హత” అన్నది అమ్మ. మడిగా ఉన్నవాళ్ళకి ఒక యజ్ఞకుండం, మామూలు వాళ్ళందరికీ ఒక యజ్ఞకుండం ఏర్పాటు చేయించింది. నాబోటి వాళ్ళందరూ మామూలు యజ్ఞకుండం దగ్గరకే వెళ్ళాం ఆ ఆనందాన్ని అనుభవించాం.
అమ్మ అందరినీ తన మాటలతోటి చేతలతోటి స్పర్శతోటి అనుగ్రహించింది. అమ్మ హస్తపాదస్పర్శతో జిల్లెళ్ళమూడి పవిత్రమైన క్షేత్రం. అక్కడ పంచభూతాలు కూడా అమ్మ ఉచ్ఛ్వాసనిశ్వాసలతో పవిత్రమైనవే.
0 Comments