Velagapudi Gopi Krishna

Interviewed by
Ravuri Prasad
10/01/2012
Hyderabad

 

శ్రీ వెలగపూడి గోపీకృష్ణ

  వీరు 29-5-1974 తేదీన జన్మించారు. స్వస్థలం- హైదరాబాద్. తండ్రి శ్రీవెలగపూడి శివరామప్రసాద్. భార్య శ్రీమతి పావని. విద్య- B. Tech, M.S. (USA). ఉద్యోగం- Tech (Mahendra). సంతానం- ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.

సేవాతత్పరత : అమ్మను దర్శించకపోయినా, అమ్మప్రేమతత్వాన్నీ, అమ్మ సూక్తుల వైశిష్ట్యాన్నీ చక్కగా ఆకళింపు చేసుకున్నారు. అమ్మ అందరి ఎడల చూపే ఆదరణ, ఆప్యాయతలకి ముగ్ధులై యధాశక్తి అమ్మను అర్చించుకుంటున్నారు.

శ్రీ రావూరి ప్రసాద్ 10-1-2012న హైదరాబాద్లో శ్రీ వెలగపూడి గోపీకృష్ణ గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ఒకమాట

జూన్ 12, 1985 తేదికి ముందు శరీరంతో ఉండగా అమ్మని దర్శించినవారి అనుభవాలనే ముందుగా ఈ Project Record చేయ సంకల్పించాం. ఈ క్రమంలో ముందుగా శ్రీవిఠాల రామచంద్రమూర్తి దంపతుల అనుభవాలు Record చేశాం. ఇక Camera, lights తదితర సామాగ్రి సర్దుకుందామనగా – ‘మా అల్లుడు గోపీకృష్ణ ‘అమ్మ’ ని గూర్చి మాట్లాడతాడు’ దాన్ని కూడా Record చేయమని కోరారు శ్రీరామచంద్రమూర్తిగారు. యువకుడు, Software companyలో ఉన్నతోద్యోగి. పైగా అతడు అమ్మ ఉండగా దర్శించినవాడు కాదు. అయినా ఆత్మీయ సోదరులు శ్రీవితాల రామచంద్రమూర్తిగారి మాట కాదనలేక యాంత్రికంగా అతడి Interview పూర్తి చేశాను.

అతడు అమ్మని దర్శించకున్నా – అమ్మ చర్యలు, అమ్మ మాటలు, అమ్మతత్వం తన పైనా ఈ సమాజంపైనా ఎంతటి ప్రభావం చూపాయో వివరించిన తీరు నన్ను విస్మయపరచింది. తర్వాత ఫలానా వారినే Interview చేయాలనుకోవడానికి నీవెవడివి? అన్న ప్రశ్న నా ముందు నిలచింది. అమ్మ ప్రభావం కాలాతీతం అయినదని స్పష్టమయింది. అందుకు ఉదాహరణగానే ఇపుడు శ్రీ వెలగపూడి గోపీకృష్ణ Interview సారాంశం మీముందుంది.

మీరు అమ్మని శరీరంతో వుండగా దర్శించినవారు కాదు ! మిమ్ము 'అమ్మ' ఎలా ప్రభావితం చేసిందంటారు?

“తృప్తేముక్తి” అని అమ్మ చెప్పింది. అది అసాధారణమైనటువంటి వాక్యం. ఒక ఉదాత్తభావనని అలా సరళంగా సూటిగా చెప్పటం సామాన్యమైన విషయం కాదు. ఎవరికైతే అసాధారణ అఖండ జ్ఞాన సంపద ఉంటుందో వాళ్ళే ఎట్లాంటి వాళ్ళకైనా అర్ధం అయ్యేట్లు బోధించగలరని నా ఉద్దేశము.

నేను షిర్డీసాయిభక్తుడిని; వారి గ్రంథాలు చదువుతుంటాను. అమ్మ ఇంకా సరళీకృతం చేసి చెప్పింది. “తృప్తే ముక్తి” అనే అమ్మ వాక్యాన్ని ఎవరైనా వారి జీవితాల్లో ఒకసారి అన్వయించుకుని ఆలోచిస్తే ఒక స్పష్టత కలుగుతుంది. నాకైతే ఆ స్పష్టత వచ్చింది. అది కొంచెం విప్లవాత్మకమైనది.

‘అమ్మ ఏం చెప్పింది?’ అని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. కఠినమైన క్లిష్టమైన భావాల్ని సైతం అమ్మ సులభంగా వివరిస్తుంది. నాకు ఏదైనా చిక్కుముడి సందర్భం ఎదురైతే అనిపిస్తుంది – ‘అమ్మ ఉంటే ఏమని చెప్పేదో”- అని. ఎవరైనా అమ్మ మాటలు వింటే వాటి ‘వైలక్షణ్యం – వైశిష్ట్యం’ తప్పక తెలుస్తుంది.

‘ద్వైతం – అద్వైతం – విశిష్టాద్వైతం’ అని మూడు పరమ తత్వాలు ఉన్నాయి కదా! అరటి పండును చూపించి ‘అద్వైతం’ అనీ, తొక్కని వేరుచేసి ‘ద్వైతం’ అనీ, ఒలిచి ‘విశిష్టాద్వైతం’ అనీ – ఆ మూడు లక్షణాలను వివరించటం చాలా గొప్ప విషయం. వాటిమీద చాలా మంది ఉద్గ్రంధాల్ని రచించారు. ఆ ఉదాహరణ నా బోటి వానికి చాల సులభంగా అర్థమౌతుంది. అందుకే ‘అమ్మ’ మూర్తీభవించిన జ్ఞానం. కనుకనే సూక్ష్మంగా చెపుతోంది. అదే అమ్మలో విశేషం. ఇలాంటివి గ్రంధాలు చదివితే వస్తాయా?

శాస్త్ర జన్యజ్ఞానం వేరు; తనను తాను తెలుసుకున్న అనుభవజ్ఞానం వేరు. ‘అద్వైతం అంటే ఏమిటమ్మా?’ అని అడిగితే “కూతురిని కోడలుని ఒకలా చూడటం” అన్నది. ఈ వివరణ అద్భుతం- ఆశ్చర్యకరం. నువ్వు ఎక్కడికో వెళ్ళనక్కరలేదు- నువ్వు చేసే ప్రతీదాంట్లో చూసుకో అని చెప్పడమో; ఎవరినీ కించపరచుకుండా చెప్పడమో; నిత్యజీవిత అంశాలను తీసుకుని చెప్పడమో. వాస్తవంగా కోడలు- కూతురు ఆ ఇద్దరిలో తేడా తప్పకుండా కనిపిస్తుంది. అది బహుశః మానవ స్వభావం కావచ్చు. అక్కడ మొదలుపెట్టి, దానిని అధిగమించటం ద్వారా ఇతరత్రా అన్నిచోట్లా అధిగమిస్తావు అని చెప్పడం. అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డలకి వేరే బిడ్డలకి తేడా చూడలేదు. అట్టి మానసిక పరిణతి పొందటం గొప్ప సాధనే నా దృష్టిలో, ‘సమదృష్టి పండిత ‘లక్షణం’ అంటారు. అది చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళకే సాధ్యం. ఆ ఉన్నతస్థితిలో ఉన్న అమ్మకి భేదాలు కనిపించవు.

ఎప్పుడైనా మీరు జిల్లెళ్ళమూడిని దర్శించారా?

నేను జిల్లెళ్ళమూడి రెండు సార్లు వెళ్లాను. జిల్లెళ్ళమూడి దగ్గరలో కొండముది గ్రామం మా తాతగారి స్వగ్రామం. ప్రతీ వేసవిలో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అమ్మ 1985లో శరీరాన్ని విడిచిపెట్టిందని విన్నాను. అప్పటికి నాకు 13, 14 సంవత్సరాల వయస్సు. ఆ కాలంలో జిల్లెళ్ళమూడి వెళ్ళి ఒకసారి అమ్మని చూసి ఉంటే నా జీవితానికి మంచి మలుపు ఉండేదేమో ననిపిస్తుంది. అక్కడికి దగ్గరలోనే ఉన్నాను. అప్పట్లో ఆమెను గురించి విన్నాను కూడా. ఇంత విశేషం అని తెలియదు.

అమ్మని చూడలేకపోయానే అని ఎప్పుడన్నా మీకనిపించిందా?

అనిపించింది. నాకు ఒక ప్రాధమికమైన తృష్ణ ఏమిటంటే జీవితంలో ఎలా ఉండాలి – అది ఇంచుమించు లోలోపల పీడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన సొమ్ముని ఎక్కడ ఖర్చు చెయ్యాలి ? ఏం చెయ్యాలి? అని. అమ్మ వాక్యం ఒకటి ఉంది “నీకిచ్చింది తృప్తిగా తిని”; అక్కడితో ఆగిపోకుండా “ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అన్నది. నిన్ను నువ్వు మాడ్చుకోకుండా తిను. అప్పుడన్నా కనీసం మిగతా వాళ్ళ అవసరాలు గ్రహించు- అని చెప్పటం బాగుంది. మౌలికంగా ధనం ఎక్కువగా ఉన్నవాళ్ళకి యింకొకరికి ఇవ్వాలని ఉండదు – తక్కువగా ఉన్నవాడు పంచుకుంటాడు. ఎక్కువగా ఉన్నవాడు తక్కువగా పంచుకుంటాడు. ఎందుకో ఆ ‘తృప్తి’ అనేది రావటం లేదు. నేను అమ్మని చూడలేదని బాధపడేది అందుకే. అప్పుడే అమ్మ వాక్యాలు విని ఉంటే నాకు స్వార్థం వచ్చేది కాదేమో!

అమ్మను దర్శించినవారి పై 'అమ్మ' ప్రభావం ఎంతవరకు వుందని మీరు భావిస్తారు?

జిల్లెళ్ళమూడి అమ్మ భక్తుల్లో నేను గమనించిందేమంటే, ఇంటికి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా ముందు భోజనం పెట్టడం – అది చాలా గొప్ప లక్షణం. ఉన్నంతలో వాళ్ళకి బట్టలు పెట్టడం చాలమంది ఆచరిస్తున్నారు – అనుసరిస్తున్నారు. అలా నేను మా మామయ్య శ్రీవిఠాల రామచంద్రమూర్తి గారింట్లో చూశాను. నా బాల్యంలో ఎవరైనా మా ఇంటికి వచ్చినపుడు బట్టలు పెట్టడం ఆచారం ఉండేది. ఈ తరంలో ఎవరూ దానిని పాటించడం లేదు. బట్టల సంగతి తర్వాత- వచ్చిన వాళ్ళకి అన్నంపెట్టటం చెయ్యాలి కనీసం. మన కోసమే మనం సరిగా వండుకోవటం లేదు- వేరే వాళ్ళదాకా ఎక్కడ? ‘ఆదరంగా పెట్టుకోవటం’ అనే దాన్ని చాలామందిలో అమ్మ ప్రోది చేసి వెళ్ళిపోయింది. అది అసాధారణమైన విషయం- విజయం, గొప్పసాధన. ఎవరైనా ఇంటికి రాగానే వాళ్ళకి ఆకలిగా ఉంటుందని ఏదైనా పెట్టాలని నాకైతే తట్టదు. ఒకవేళ ఎవరైనా పెడితే మటుకు నాకు చాల సంతోషంగా ఉంటుంది. మనం ఎవరింటికైనా వెళ్ళినపుడు మనతో చెప్పకుండానే మన ఆకలి గుర్తించి పెట్టడం చాలా గొప్ప అనిపిస్తుంది. మనం చెయ్యలేకపోతున్నాం. అమ్మ చాలా మందిని అలా తయారుచేసి వెళ్ళి పోయింది.

ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నంపెట్టు అనటం అనేదీ, అనేకమందికి అలా పెట్టటం – పెట్టించటం, చాలవిశేషం. నేను రెండు మూడు కుటుంబాల్ని చూశాను. వాళ్ళు చాలా ఇష్టంగానే అన్నం పెడుతున్నారు వాళ్ళ ఇళ్ళలో; వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మొట్టమొదటి కార్యం అదే. అందుకు మా మామయ్యగారు ఒక చక్కని ఉదాహరణ. అమ్మ చెప్పిందనీ, అది వారి జీవితంలో ఒక భాగం అయింది అది నాకు ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు, తప్పక రావాలి. ఆ లక్షణం పుస్తకాలు చదివితే వస్తుందనుకోను. ఉదాహరణలు చూస్తే వస్తుంది. పుస్తకాల్లో కూడా చాలా మంది రాస్తారు. గ్రంధాలు వేరు. వాస్తవ జీవితంలో ఉదాహరణలు వేరు. అది అమ్మ ఈ లోకానికి, సమాజానికి అనుగ్రహించిన గొప్ప సేవా భాగ్యం. లక్షలమంది బిడ్డలని ఆవిధంగా ప్రభావితం చేసి వెళ్ళింది ‘అమ్మ’. ఆచరణాత్మకంగా అమ్మ బోధించిన ఈ ఒరవడి అమ్మ బిడ్డలంతా నిరాటంకంగా కొనసాగించ గలందులకు అమ్మను సదా ప్రార్థిస్తున్నాను.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!