V S R Moorty

Interviewed by
Ravuri Prasad
04/11/2014
Jillellamudi

 

శ్రీ వి.యస్.ఆర్.మూర్తి

  వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య B.Tech. ఉద్యోగం : Scientist in Food and oil Technology.

ప్రవృత్తి : పుట్టపర్తి సాయిబాబా, జిల్లెళ్ళమూడి అమ్మ, రమణ మహర్షి వంటి సిద్ధపురుషులు, అవతారమూర్తుల తత్త్వానికి నిలువెత్తు దర్పణం పట్టారు. దేశవిదేశాల్లో 14 వేలకు పైగా సత్సంగాలు నిర్వహించారు. ‘యోగతారావళి’, ‘అమ్మత్వం’, ‘రమణాయణం’ వంటి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్ని రచించారు. మాజీ రాష్ట్రపతి శ్రీ ఎ.పి.జె. అబ్దుల్కాలాం, పండిట్ రవిశంకర్ వంటి మహాత్ములతో కలిసి పనిచేశారు.

శ్రీ రావూరి ప్రసాద్ 04-11-2014న జిల్లెళ్ళమూడిలో శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

ముందుగా మీ గురించి తెలియపరచండి.

గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళలో జన్మ ఎత్తినటువంటి నేను మా మాతామహుల ఇంట పెరిగాను. మా ఇంటి ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర దేవాలయము ఉన్న కారణంగా నిరంతరమైనటువంటి భగవన్నామము, భగవచ్చింతన, భగవద్భావన, అర్చన ఇవన్నీ బాల్యంలో నా మనస్సుపై బాగా ముద్రవేశాయి. బహుశః తదనంతరకాలంలో అవే నన్ను ఈ ఆధ్యాత్మికతవైపు మళ్ళించాయని భావిస్తాను.

మొదటిసారి అమ్మను ఎపుడు దర్శించారు? నాటి మీ అనుభవం ఏమిటి?

అమ్మ దగ్గరకి నేను వచ్చేటప్పటికి నాకు సుమారు 11 – 12 ఏళ్ళ మధ్య వయస్సు. 1962లో ఇంకొల్లులో నేను IV form చదువుకుంటున్నాను. మా బావగారు బాపట్ల వస్తూ జిల్లెళ్ళమూడి వెళ్ళాలనిపించి ‘మనం జిల్లెళ్ళమూడి అనే ఊరు వెడుతున్నాం. అక్కడ ఒక అమ్మవారు ఉంది. ఆమెను చూద్దాం’ అన్నారు. సరేననుకున్నాం. కానీ అట్లా జరగలే. ఎప్పుడైతే నాకు మనస్సులో ‘అక్కడొక అమ్మవారు ఉన్నది’ అనే భావన కలిగిందో – ఒక రోజు ఇంట్లో చెప్పి నా అంతట నేను బాపట్ల వచ్చి జిల్లెళ్ళమూడి చేరుకున్నాను.

ఒక తీవ్రమైన శుభేచ్ఛ కూడా నాయందున్నది. ఆ సమయంలో ‘అమ్మ ఎలా ఉంటుంది? చూద్దాం’- అదే ఉద్దేశ్యంతో మొదటిసారి రావటం. ఇవాళ ఉన్న జిల్లెళ్ళమూడికి 1962లో ఉన్న జిల్లెళ్ళమూడికి చాలా మార్పు ఉంది. ‘ఎక్కడ ఉంటుంది ఆమె?’ అని కనిపించిన వారిని అడిగాను. ‘అదిగో అక్కడ’ అని చూపించారు. వెళ్ళబోతున్నాను- ఒక పెద్దాయన ఆపేశారు నన్ను కానీ లోపలినుంచి ఉచ్ఛైస్వరంతో ఓ కంఠం వినిపించింది- “వాడ్ని నేను పిలుచుకున్నాను. లోపలికి తీసుకురా” అని. నన్ను ఆపిన ఆయనలో సంభ్రమం గమనించాను. నా మనస్సుపై అది ముద్రవేసుకుంది. నన్ను లోపలికి తీసుకెళ్ళారు. అమ్మమంచం దగ్గర నేను మామూలుగా కూర్చున్నాను. ఎందరెందరో వస్తున్నారు; వెడుతున్నారు, మాట్లాడుతున్నారు.

సుమారుగా ఒక గంట, గంటన్నర సమయం అయిపోయిన తర్వాత నెమ్మదిగా అమ్మ నావైపు తిరిగి మాట్లాడింది. ఒక అరటిపండు తీసి తోలు ఒలవటం ప్రారంభించింది. దానిని త్రుంచి నోట్లో పెడుతున్నది. ఆ క్షణంలో అమ్మ ఒక శుభ్రజ్యోత్స్నలా ఉంది. అమ్మ చేయి ఎంగిలౌతుందేమో! అది ఆత్మాను భూతి. మామూలు మాటలు, కవిత్వానికి అందే సౌందర్యం కాదది. జగదేక సౌందర్యమే కాక జగదతీత తేజోరూపాన్ని పరమాద్భుతంగా చూశా.

అరటి పండుపై తొక్క తీస్తూ “పై తోలు తీస్తే కదు- నాన్నా! లోపలి పదార్థం కనపడేది. ఆ పదార్థాన్ని చూస్తే ఏం ప్రయోజనం? తింటే కదా అనుభవం కలిగేది; ఆత్మారాముడికి శాంతి కలిగేది” అంటూ ప్రారంభించింది. అవి అమ్మ తొలివాక్యాలు. అంటే ఉన్నదంతా లోపలేఉందని, పైపైన ఏమీలేదని, లోపలికి వెడితే తప్ప అసలు విషయం అర్థం కాదని, కేవలం చూడటంతో మాత్రమే కాదు; అనుభవించాల్సిన యోగ్యత ఉన్నదనీ – ఈ అర్థాలన్నీ ఇప్పుడు స్ఫురిస్తున్నాయి. అలా అమ్మ తత్త్వంతోనే ప్రారంభించింది నా విషయంలో అనుభవాల్ని దాటిన అనుభూతినిచ్చింది. అమ్మ దర్శనం చేయటమే తొలి అనుభవం. ఆమె చేతివేళ్ళు నా నోటిలో పడటమే ఆమె నాకు అనుగ్రహించిన దశ.

కేవలం నా ఆకలిని నివారించడం కోసం అమ్మ అరటిపండును తీయలేదు. తత్త్వబోధచేస్తూ ప్రారంభించింది. భోజనం వేళ అయింది. అమ్మ ఒక పళ్ళెంలో ప్రత్యేకంగా అన్నం తెప్పించింది. ముద్దలు కలిపింది. నాకు బాగాగుర్తు. “కాస్త ఒట్టిపప్పు, ఎక్కువనేయి తీసుకురా” అని ఎవరికో చెప్పింది. తెచ్చారు. ముద్దలు కలిపి చాలా సేపు పెట్టింది. పెడుతూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూనే ఉన్నది. నేను తింటూ ఊ కొడుతున్నాను. ప్రతి మెతుకులోనూ జ్ఞానాన్నాన్ని వరదానం చేసింది. ఇవాళ జరుగుతున్నటువంటి జీవనశైలిని కానీ జీవన దృక్పధాన్ని గాని గమనించినపుడు అర్థమౌతుంది. భోజనానంతరము అడిగింది, “ఇంట్లో చెప్పి వచ్చావు కదా నాన్నా!” అని. అవునమ్మా, చెప్పి వచ్చానన్నాను. “నాకోసమే వచ్చావు కదా?” అన్నది. ‘ఔనమ్మా! నిన్ను చూద్దామని వచ్చాను’. తల్లిగా భావించి ఉంటుంది – మనస్సు. ‘నువ్వు’ అంటూనే ఏకవచనం తోనే మాట్లాడాను. మిగతావాళ్ళు అమ్మని ‘మీరు, ‘మీరు’ అంటున్నారు. ఒక ద్రాక్ష పండ్ల గుత్తి తీసి దానిలోనుంచి ఒక పండు తీసి నోట్లో పెట్టి “ఇదంతా నీకోసం” అన్నది. అమ్మ చేతులు బంగారు వర్ణంలో ఉన్నాయి. అమ్మచేతులు ఎంగిలి అవుతాయేమో అని నాకు అనిపించిన మరుక్షణం అమ్మ “ఎంగిలికాని దేమీ ఉండదు, నాన్నా! బ్రహ్మము ముట్టనిది ఏమైనా ఉన్నదా? ఈ చేస్తున్నదంతా నాకోసం” అన్నది. అంటే నేను తింటున్నప్పుడు నేను పొందిన ఆనందం తన ఆనందానికి కారణం. మూడున్నర గంటల ప్రాంతంలో నల్లని పెద్ద ద్రాక్ష పళ్ళగుత్తి నా చేతిలో పెట్టింది, పది రూపాయల నోటు నా జేబులో పెట్టింది. “చక్కగా వెళ్ళు, నాన్నా! బాగా చదువుకో. వస్తూండు. అమ్మను చూసుకుంటూండు-”అన్నది.

అమ్మ నా భవిష్యత్ రూపకల్పన ఆనాడే చేసింది. మనం అనుకుంటాం. ఈ చదువుకున్న దేమిటి? చేస్తున్నదేమిటి’- అని. ఈ లోకసంబంధమైన విద్యకి అసలు విద్యకి ఖచ్చితమైన తేడా అమ్మకి తెలుసు. 1962, 63,64 మూడేళ్ళు వరుసగా తరచుగా వస్తూనే ఉన్నాను. సెలవలు వచ్చినయ్ అంటే అమ్మ దగ్గరకి రావటం. నన్ను అమ్మ జనసందోహంతో కలవనిచ్చేది కాదు. తన మంచం దగ్గర కూర్చోబెట్టుకునేది. ఎక్కడికీ వెళ్ళద్దనేది. “నువ్వు నా దగ్గరుండు, నాన్నా! నువ్వు నాకోసం వచ్చావు” అనేది. ఒక అవతారమూర్తి, జగజ్జనని సామాన్యుడితో, మాన్యుడితో, అసామాన్యుడితో ఎట్లా react అవుతుందో? నేను గమనించాను. వాళ్ళు ఒక అవతారమూర్తి నుంచి ఏం కోరుకుంటారు? – ఇవన్నీ నేను Observe చేయటానికి బహుశః నన్ను అమ్మ ఆ దృశ్యంలో నిలబెట్టింది; కూర్చోబెట్టింది – అనేది నా గట్టి నమ్మకం.

ఈమె ఏం చదువుకోలేదు కదా, ఈమె దగ్గర ఏమీ డిగ్రీలు లేవు కదా! గొప్ప గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆమెకి ఎందుకు దణ్ణం పెడుతున్నారు? ఆమెను చూడగానే ఎందుకని ఏడుస్తున్నారు?- ఈ భావస్పందనలు అన్నీ వాళ్ళకి ఎలా కలిగిస్తున్నదీమె? వాళ్ళతో ఏమీ మాట్లాడంలేదు, వాళ్ళనేమీ తాకడంలేదు, మీ కష్టాలేమిటో చెప్పండి అనటం లేదు. వస్తున్నారు – చూస్తూనే ఒక భావావేశానికి లోనవుతున్నారు. ఇవన్నీ గమనించినప్పుడు ఈ అమ్మ ఇన్ని వేలమందితో ఏకకాలంలో అక్కడి నుంచి కదలకుండా ఎలా చెయ్యగలగుతున్నది? ఇది మానవశరీరం కాదు- అనిపించింది.

మీరు సన్నిహితంగా మెలిగిన మహితాత్ముల గురించి తెలపండి.

9-5-1962 తేదీన మొదటిసారి అమ్మను దర్శించుకున్నాను. నెలరోజులకి ‘ఆంధ్రప్రభ’ వార్తాపత్రికలో ఒక News Item సాయిబాబా గారి నిలువెత్తు ఫోటో; ఆ క్రింద “ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ అవతరించినారు. ఆయనే పుట్టపర్తి సాయిబాబా” – అని. దానితో నేను connect అయ్యాను. నేరుగా ప్రశాంతి నిలయానికి వెళ్ళాను. శ్రీ సత్యసాయిబాబాగారు “నేను కాచుకు కూర్చుంటినే” అన్నారు. ఎవరికోసం? ప్రపంచమంతా ఆయన దర్శనం కోసం ఎదురుచూస్తోంది. ఖచ్చితంగా 9-6-1962 తేదీన బాబాగారి దర్శనం.

నేను మా అమ్మ దగ్గర పెరగలే; మా అమ్మమ్మ దగ్గర పెరిగా. అమ్మ అరటి పండు తినిపిస్తున్నపుడు నాకళ్ళ వెంటనీళ్ళు వచ్చినయ్. “నేను అమ్మను కన్న అమ్మే కద, నాన్నా! అమ్మనీ నేనే – అమ్మమ్మనీ నేనే. తినరా” అన్నది. ఇవన్నీ నెమరు వేసుకుంటే కలిగే భావం ఏమిటంటే- వాళ్ళు దిద్దుతారు. వాళ్ళకి కావలసిన ఒక పనిముట్టుని ఎంచుకుంటారు. దానికి కావలసిన శక్తిని వాళ్ళు ప్రసారం చేస్తారు, నిక్షిప్తం చేస్తారు. ఇటు లోకరీతిలో అటు పారలౌకిక రీతిలో ఆభావాలు కలిగిస్తారు. ‘రఘువరదాసు’ గారు, ‘అమ్మ’ ఈ ఇద్దరితో పాటు ‘సత్యసాయిబాబా వారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది- భగవంతుడు అంటూ ఉంటే వారి లాగే ఉంటాడు.

నేను పొందిన అదృష్టమేమంటే ఆరెండు అవతారమూర్తులతోను మమేకమైనాను. అమ్మకి గురువు లేరు, స్వామికి గురువులేరు. గురువే అవసరం లేని గురువే నాకు గురువు- ఇటు స్త్రీ స్వరూపంగా, అటు పురుషస్వరూపంగా. ఇది నేను చేసుకున్న పుణ్యమే- అని నా ఖచ్చితమైన భావన.

మిమ్మల్ని ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అంటారు కదా! ఆ నేపథ్యాన్ని వివరించండి.

నేను Oil technology చేస్తున్నపుడు స్వామితో అనేక Interviewsలో ఒకసారి “బంగారూ! నువ్వు ఆధ్యాత్మికశాస్త్రవేత్తవి” అన్నారు. ‘ఆధ్యాత్మికశాస్త్రవేత్త’ అనే దానికి సమాధానం ఇస్తూ – ‘భారతీయ తత్త్వ సిద్ధాంతంలో ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది; తత్త్వవేత్తలున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా భగవంతుడిని ప్రపంచానికి పరిచయం చేసేవాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. దాంట్లో ఒక Rational approach ఉంటుంది; వివేకం ఉంటుంది, విచక్షణ ఉంటుంది. ఏ ఉద్వేగానికి లోను కానటువంటి ఒక నిశ్చలమైన మనస్సు ఉంటుంది” – అన్నారు. నన్ను ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ప్రపంచంలో నిలబెట్టారు స్వామి.

మీరు అమ్మ, సత్యసాయిబాబా, రమణమహర్షి తత్వాల్ని అధ్యయనం చేసినవారు. వీరిలో ఎవరి 'తత్వం' మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది?

నాచిన్నతనంలో నా స్నేహితుని ఇంట్లో రమణ మహర్షి ఫోటో ఉండేది. ఆ కళ్ళు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన ఒక మహానుభావుడనీ, చాలా గొప్పవ్యక్తి అనీ, చాలా నిరాడంబరుడనీ, ఇట్లా కూడా ఉండవచ్చునని ఒక ప్రేరణ కల్గింది. 1984 లో అరుణాచలం నుంచి నేను పుట్టపర్తి వచ్చాను. స్వామి నా కళ్ళలోకి సూటిగా చూస్తూ “రమణులంటే ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఈశ్వరుడు. మరచకు. బంగారూ!” అన్నారు. అన్వేషణ ముగిసింది. ఆయన దేవుడు. అయితే దేవుడని ఎవరు చెప్పారు? దేవుడైనవాడు చెపుతున్నాడు. ‘దేవో భూత్వా దేవం వ్యజేత్’ ఇది కదా ప్రమాణం.

మహర్షి మౌనం వెనుక దాగి ఉన్నటువంటి ధార్మికత, ఆయనబోధ, వెనుకదాగి ఉన్నటువంటి ఒక సమన్వయ సిద్ధాంతం- దైవం అనే మాట ఆయన వాడలేదు. ఆయన్ని ఎవరో అడిగారు. ‘ God అంటే ఎవరు?’ అని. “God is nothing but a force and a feeling within” అన్నారు. ఆ “Within” అనేది చాలా అద్భుతమైనమాట. రమణమహర్షి ఏం చెప్పారో దాన్ని demonstrate చేసింది అమ్మ. ఈ మూడూ మహత్తర స్వరూపాలు. నీకు అమ్మ ఇష్టమా? బాబాగారు ఇష్టమా? మహర్షి ఇష్టమా?- అని అంటే ఒకటే ఇష్టం మూడు పాయలైంది. నేను ఎక్కడ ఉన్నా పూజా సామాగ్రిలో ఈ ముగ్గురి చిత్రపటాలూ ఉంటాయి.

నేను మళ్ళీ జిల్లెళ్ళమూడి రావడానికి 44 ఏళ్ళు పట్టింది. 44 ఏళ్ళూ అమ్మని నేనేం వదిలిపెట్టలే. అమ్మ కూడా నన్నేమీ వదిలిపెట్టలే. శ్రీ మోహనకృష్ణగారి ఆహ్వానంపై ‘తత్త్వచింతన’ సభలో ప్రసంగించటానికి నా ఆప్తమిత్రులు శ్రీ కుప్పా కృష్ణమూర్తి గారితో కలిసి వచ్చా. ఆ రోజున ఇదే ప్రాంగణంలో జిల్లెళ్ళమూడిలో మాట్లాడుతూ ‘నా కనురెప్ప వాలే దాకా అమ్మకి సేవ చేస్తా’ అన్నాను. నేను ఆజన్మాంతం అమ్మకి కృతజ్ఞుడనై ఉన్నాను.

ఒకసారి ప్రశాంతి నిలయంలో Canteen ప్రారంభిస్తూ స్వామి అన్నపూర్ణాదేవి బంగారు విగ్రహాన్ని సృష్టించి ఒక మాట అన్నారు “ఇప్పటి దాకా ఈ ప్రపంచంలో అన్నదానంగా అనబడినటువంటి ఈ మహాయజ్ఞం జిల్లెళ్ళమూడి అమ్మ కారణంగా నిరంతరంగా సాగుతూ ఎవరి భోజనం ఎవరి ముద్దవాళ్ళు తినేట్టు రీతిలో సాగింది. ప్రేరణ అదే కారణమూ అదే”- అని.

స్వామి “మీ జ్ఞానం కానీ విజ్ఞానం కానీ మీ సంపదకానీ కీర్తిగానీ సమాజహితం కాకపోతే నీ జీవితం అసంపూర్ణం”- అని చెప్పారు.

అమ్మా - రమణుల బోధల సారూప్యం ఏమిటి?

అమ్మ మాటల్ని రమణ మహర్షి బోధల్ని విన్నట్లయితే వాళ్ళిద్దరూ కూడబలుక్కుని చెప్పారా అన్నట్టు ఉంటుంది. రమణమహర్షిది సుదీర్ఘమైన వ్యాఖ్యానం ఎక్కడన్నా ఉంటే దాని సంక్షిప్తస్వరూపం అమ్మవాక్యం ఇక్కడ వినపడేది. ఇక్కడ అమ్మ ఎప్పుడైనా సుదీర్ఘమైన వ్యాఖ్యానం చేస్తే ఏకవాక్యంగా అక్కడ తిరువణ్ణామలైలో వినపడేది.

సర్వసిద్ధులను తన అరచేతిలో పెట్టుకున్నటువంటి అమ్మ ఒక్క సిద్ధిని కూడా తనకోసం వాడుకోకుండా అతి బాల్యంలోనే సమాజహితం చేసింది; అందువలననే ‘విశ్వజనని’ అయింది.

హైమక్కయ్యని శరీరంతో ఉన్నపుడు చూశారా?

అందమైన బొమ్మ నడిస్తే ఎట్లాఉంటుందో హైమ అట్లా ఉండేది. ఒక సుందరమైన బొమ్మ. చాలాసార్లు చూశాను, మాట్లాడాను. హైమ అటూ ఇటూ తిరుగుతూండేది; అమ్మ దగ్గరకి వస్తూండేది వెడుతూండేది. చేతులు చాల అలవోకగా చిన్ముద్ర ధరించినట్టుగా ఉండేవి. అది నిత్యచిన్ముద్ర. చాలా విశేషం. అది సిద్ధపురుషులకి మాత్రమే సాధ్యం. అది కూడా వాళ్ళు సాధన చేసేటప్పుడు చిన్ముద్ర వేస్తారు. చిన్ముద్రతోనే జీవించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క హైమే. లోకంలోకి రావాలి కనక తల్లి గర్భాన్ని ఆశ్రయించటం ఒక ఎత్తు ఐతే తల్లి గర్భం నుంచి పుట్టుకతోనే విడిపోయినటువంటి మహాతపస్విని హైమ. తనను తాను సిద్ధం చేసుకుంటున్నది ఏదో బృహత్తర ప్రణాళికకి.

అందరూ నా బిడ్డలే అన్న 'అమ్మ' తాను కన్న బిడ్డకే ఎందుకు దైవత్వాన్ని ప్రసాదించిందంటారు ?

“హైమను కన్నాను” అన్నది అమ్మ; అంటే తెచ్చుకుంది. “పెంచాను అన్నది;” అంటే దానికి ఒక రూపకల్పన చేసింది. “చంపుకున్నాను” అన్నది; అంటే ఆమెకా సమయం ఆసన్నం కావటానికి ఒక ప్రణాళిక వేసుకున్నది. తన సర్వశక్తుల్నీ కూడా ఒక పాత్రలోనింపి ఈ ప్రపంచానికి ఇవ్వాలి. ఈ శక్తిని హైమ అనేటటువంటి దేహంలో నిక్షిప్తం చేయాలంటే హైమ దేహాతీతం కావాలి. హైమను ఘటాకాశం నుంచి చిదాకాశం చేసింది; తన సర్వశక్తుల్నీ దాంట్లో కూర్చోబెట్టింది. తాను ఉండగానే హైమాలయాన్ని ప్రతిష్ఠించింది. హైమను ఎలా పూజించాలో గౌరవించాలో నేర్పింది. హైమ అంటే ఏమిటో చెప్పింది. హైమది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో హైమ ఒక భాగం.

హైమాలయంలో కూర్చొని కనక హైమను గురించో, మన గురించో, అమ్మను గురించో ఆలోచించినట్లైతే హైమయందున్నటువంటి శక్తి ఆ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి అనేక విధాల మనకి అక్కరకి వస్తుందనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దీనికి ఇంకొక్క సారూప్యం కూడా చెపుతాను రామకృష్ణ గురుదేవులు ‘నరేన్’ అనేటటువంటి ఒక వ్యక్తికి తన తపస్సంతా ధారబోసి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మనం- “నరేన్! నాటిరాముడు, నాటికృష్ణుడు, కలిపితే ఈ రామకృష్ణుడై వచ్చాడే. నా సర్వశక్తులూ నా తపస్సంతా నీకు ధారపోస్తున్నాను. నేను బికారినైనాను ఈ క్షణాన.” అంటే He emptied himself. అమ్మ చేసింది అదేపని.

హైమ శరీరాన్ని వదిలినప్పుడు – ‘జిల్లెళ్ళమూడి అమ్మ కూతురు పోయిందట కదా! పాపం. గర్భశోకం ఆమెకీ తప్పలే’ అన్నారు. ఆ మాట విన్నప్పుడు ‘ఆగర్భశోకంతోనే ఆమె వచ్చింది. మీ కంటికి కనిపిస్తున్నది ఒక హైమే. ఎంత మంది రాలిపోతే ఆగర్భం దానిని అనుభవించిందో తెలుసునా?’ అన్నాను.

అమ్మ భర్త (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు) గారిని అమ్మ ఆలయ ప్రవేశం చేయించిన సందర్భాన్ని ప్రస్తావించినపుడు

దాంపత్య ధర్మము, కుటుంబవ్యవస్థ, వివాహవ్యవస్థ ఎంత గొప్పదో అని చెప్తూ ఒక అనసూయ మాతృశ్రీగా ఒక పరిణామం చెందడం వెనుక బ్రహ్మాండం నాగేశ్వరరావుగారి పాత్ర చిరస్మరణీయమైనది. ఆమె యొక్క దివ్యత్వాన్ని ఆయన గ్రహించారు. “నేను జగత్తుకి తల్లిని కానీ ఒక పురుషునికి భార్యనే. ఆయన కివ్వవలసిన గౌరవాన్ని నేను ఇవ్వవలసిందే”- అంటూ సమస్త స్త్రీ లోకానికి “మూలాలన్నీ మీ కుటుంబంలో ఉన్నాయి. కుటుంబంలో ఒక సమన్వయ సాధన చేసుకోండి. దైవం అంటూ వేరే లేడు. మీ భర్తను మించిన మిమ్మల్ని కాపాడేవాడు, భరించేవాడు; మీకు సమాజంలో ఒక భద్రత ఒక ముద్ర ఇచ్చేవాడు” – అని వివాహ వ్యవస్థకి అమ్మ వేసిన ఒక బలమైన ముద్రే (నాగేశ్వరరావుగారు నాన్నగారు.

'అందరికీ సుగతే' అన్న అమ్మ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

సుగతి అంటే జన్మలేకపోవటం కాదుగా. అమ్మ ఆ గ్యారంటీ ఇవ్వలేదుగా! సుగతి అంటే మంచి గతి, ఉత్తమమైన గతి, ఉత్తమస్థితిని అనుగ్రహించిందే తప్ప ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పునర్జన్మలేకుండా చేస్తానని మనకేమీ వీలునామా వ్రాసి ఇవ్వలేదు. ‘సుగతి’ అంటే ఉన్న స్థితి నుండి ఉత్తమస్థితికి వెడతారు అని. ఇంకొకటి – కాస్త కామాపెట్టి, కాస్త ముందు వెనుక అన్నది. ఏం భయపడకండి-వాడికి తొందరగా వచ్చేసింది, నాకు రాలేదని- ” ఈ మంచి పనుల్లో మీరు ఉండండి, నాన్నా! మీకు సుగతి ఉంటుంది. అందరికీ ఉంది. కాస్త ముందు వెనుకగా అందరికీ నేను చూసుకుంటాను” అనేటటువంటి ఒక అభయముద్ర దాంట్లో దాగి ఉంది.

'అనుభవం శాస్త్రాన్నిస్తుంది' అన్నది అమ్మ మాట. అమ్మ వాక్యాలన్నీ అనుభవ సారాలే - వాటిని శాస్త్రాలతో సమన్వయపరచటం.

శాస్త్రం అంటే పుస్తకం కాదు. శాస్త్రం అంటే ‘జ్ఞాపకము’. పూర్వీకులు దానిని స్మృతి అన్నారు. శాస్త్రంలో విధి విధానాలుంటాయి. కాలానుగుణంగా అవి మార్పులు చెందుతూ ఉంటాయి. పదేపదే మనం దానిని update చేసుకోవాలి. “సాహిత్యంతో రాహిత్యం కాదు, నాన్నా!” అని కూడా చెప్పింది. కాబట్టి అనుభవం ఉండాలి. మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ నాకు కలిగిన నా 12 ఏళ్ళ వయస్సులో అమ్మ అనుగ్రహించినది అనుభవం కాదు. అది అనుభూతి. అక్కడ ప్రారంభమైనది. వేదాలు, శాస్త్రాలు చదవలే. విశేషమేమంటే- నాకు అవసరమైన వేళ దానిలో ఉన్న భాగాలన్నీ నా వెనక్కు వచ్చి పరుగెత్తుతాయి. అంటే తల్లి అనుగ్రహం కనక ఉన్నట్లయితే ఇవన్నీ అక్కరలే. అమ్మ మాటలకి శాస్త్ర ప్రమాణం ఉన్నదా అంటే- అసలు అమ్మే శాస్త్రం – కాకపోతే శాస్త్రభాషలో చెప్పటానికి మిగతా వాళ్ళున్నారు. అమ్మ పనికాదు. అమ్మ ఎంచుకున్న మార్గం సరళమార్గం.

‘ఆదిశంకరులు – అమ్మ’ చెప్పే అద్వైత మార్గాలలో తేడా లేమైనా ఉన్నాయా?

శంకరులకి ముందు కూడా అద్వైతం ఉంది. అద్వైతం మతం కాదు; ఒక మానసిక స్థితి. అద్వైతం అంటే ‘రెండు లేవు’ అని. అమ్మ దగ్గరకి వచ్చేటప్పటికి ‘రెండు లేవు’ మాయమైపోయింది. రెండు లేవు కాదు, నాన్నా! ఉన్నది ఒక్కటే- రెండుగా కనపడుతుంది. ద్వంద్వం లేకపోతే ఏకత్వంలోకి వెళ్ళలేవు; దానికి అతీతం కాలేవు. అనుభవంలోకి వెళ్ళాలి. దాంట్లో నిజాయితీ ఉండాలి.

ఎందరో ప్రవక్తలు ఒకే శక్తి ఇన్నిగా రూపాంతరం చెందిందని చెపుతున్నారు. అంతా అయి ఉన్న ఆశక్తికి అంతా ఒకటే నన్న స్ఫురణ అంతటా ఎందుకు కలగటం లేదు?

సృష్టికి ముందున్నది ‘సత్’ అది సూక్ష్మసూక్ష్మేతరంగానూ ఉంది. అది ఒకరోజు సంకల్పించింది – ఈ ఒక్కటిగా ఏ పరిణామం లేకుండా ఎట్లా? నన్ను నేను పరిచ్ఛిన్నం చేసుకోవాలి- అని. సృష్టి జరిగింది. అది విశ్వం. manifest అయిందన్నమాట. అది సంసారం, ప్రపంచం, కుటుంబం, వ్యక్తి అయింది. వ్యష్ఠి సమష్టి, సృష్టి, పరమేష్ఠి- ఈ నాలుగింటికి మూలం పరమేష్ఠి. పరమేష్ఠి final కాదు. ‘సత్తే’ మూలం ఆద్యంతరహితమైనది. ఈ మహాప్రవక్తలు ఏం చెప్పనా ‘సత్’ గురించే చెప్తారు. అందుకోగలిగిన వాళ్ళకి అదే కలుగుతూంటుంది. మొత్తానికి ఆ సత్ వైపే అందరం నడుస్తాం. అదే సుగతి; కాస్త ముందు – కాస్త వెనక.

సత్కీ భగవంతుడికీ చాలా తేడా ఉంది. సృజామ్యహం (నన్ను నేను సృష్టించుకుంటాను) అన్నాడు. కృష్ణునికి మూలమైన సత్ ఒక కృష్ణుని సృష్టిస్తుంది. కోటి సూర్యమండల మధ్యస్థ అయిన మహా త్రిపుర సుందరీదేవి ఒక అనసూయని సృష్టించుకున్నది. ఆమె ఏం చేసింది? తన మూలశక్తినంతా విరాట్స్వరూపంలో ప్రదర్శిస్తూ తాను ఏమిటో చెప్తూ మళ్ళీ తన మూలంలోకి తాను వెళ్ళింది. వెళ్ళింది అంటే దేహం వదిలింది అనే భావమే తప్ప ఆమె వెళ్ళిందీ లేదు, నిజానికి ఆమె వచ్చిందీ లేదు.

అమ్మని కొందరు ప్రేమస్వరూపిణిగా, మరికొందరు అవతారమూర్తిగా, ఇంకొందరు సంఘసంస్కర్తగా చూస్తున్నారు. మీరు అమ్మను ఎలా భావిస్తున్నారు?

మూడూ. మూడుపాయలు. మన కన్నతల్లి ఆ రోజుల్లో ఏడెనిమిది మందిని కనేది. ఎనిమిది మందినీ పోషించేది. కానీ ఆమె మనస్సులో తొమ్మిదవ వాడైన వారాలబ్బాయి మీద కూడా అంతే ప్రేమ ఉండేది. తన పిల్లల కంటే భిన్నంగా ఒక ముద్ద ఎక్కువ తినిపించేది. మళ్ళీ వాడికి దొరుకుతుందో లేదో అని. ఇది భారతీయ సంప్రదాయంలో ఒక అద్భుతమైన పార్శ్వం. అమ్మ తన కడుపున పుట్టినముగ్గురు బిడ్డల్ని ప్రక్కనపెట్టి, సర్వప్రపంచాన్నీ తనకోసం వచ్చే బిడ్డలుగా వారం అంటే మరల- మరల తన దగ్గరకి వచ్చేట్టు చేసుకుని వాళ్ళ జీవితంలో పొందలేని వాత్సల్యం – ప్రేమను అనుగ్రహించింది.

సంఘ సంస్కరణ- ఆస్థాయికి చెందిన వాళ్ళకి సంఘం ఉన్నదా అని. మానవుడు గీసుకునే గీతలు ఇవన్నీ Artificial boundaries “శుక్లశోణితాలకేది కులమో అదే నా కులం” అన్నది. ఎంత గొప్పమాట అది! సత్యం చెప్పింది.

“ఏ విధానం లేకపోవటమే నా విధానం” అన్నది అమ్మ. అమ్మ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన 'శ్రీ విశ్వజననీ పరిషత్' అమ్మ మాటను ఎలా అన్వయించుకు ముందుకు పోవాలి?

విధివిధానాలు నాకు లేవన్నది. కానీ మీకు లేవని చెప్పిందా? విధి విధానాలు మనల్ని నడిపించాలి లేకపోతే మనలో ఒక అలసత్వం ఒక విశృంఖలత్వం ఒక పశుత్వం ఒక దనుజత్వం విజృంభించి- ఇంతా చేసి ఒక మహాకారుణ్యమూర్తి దగ్గరకు వచ్చి చిచ్ఛక్తి స్వరూపిణి ఒళ్ళో పడుకున్న మనం చేజేతులా మరకత మాణిక్యాలను పోగొట్టుకున్న వాళ్ళ మవుతాం. కాబట్టి విశ్వజననీ పరిషతికి విధీ ఉండాలి, విధానమూ ఉండాలి. అంటే Planning ఉండాలి. Policy ఉండాలి, Schedule ఉండాలి, Scheme ఉండాలి, execution ఉండాలి; కానీ అంతర్వాహిని బహిర్వాహిని ‘అమ్మ’ కావాలి.

అందరింటి సభ్యులకు మీ సూచనలేమైనా ఉన్నాయా?

ఇవాళ అమ్మను గురించి తెలియాలి అంటే టెక్నాలజీ ప్రకారం పుస్తకాలు, C.D లు DVD లు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరిగే కార్యకలాపాలు – ఇవే దిక్కు. కాబట్టి అమ్మతో కూడి ఉన్నటువంటి ప్రతివ్యక్తి అమ్మత్వాన్ని తమ జీవన విధానం ద్వారా ప్రసారం చేయాలి.

సాధనలో చివరి దశకు చేరుకున్నవాళ్ళు, సాధనే ఎరుగని వారు (సాధనకి శ్రీకారం చుట్టుకోవడానికి), మహాత్ములు, పీఠాధిపతులు, రాజాధిరాజులు వస్తారు. వారికి సాదరంగా ఆహ్వానం పలకాలి. జిల్లెళ్ళమూడి కాలం చాలా వేగంగా పరుగెత్తుతున్నది. ఇవాళ తేజస్సుతో పరుగెత్తటానికి అమ్మ ఎంచుకున్నటువంటి బృహత్తర కాలమిది. వ్యక్తికి గానీ సంస్థకి గానీ Golden periods వస్తాయి. 20 సంవత్సరములు మించి ఉండవు అని astrology చెపుతోంది. అవతార మూర్తులున్నపుడు Astorologyలు పనిచేయవు. గ్రహాలన్నీ వాళ్ళ అనుగ్రహానికి లోబడి పనిచేస్తాయి. అమ్మ అవతారస్ఫూర్తికి మన అన్ని కుటుంబాలు సోదాహరణ పూర్వకంగా నిలబడాలి.

జిల్లెళ్ళమూడి గురుస్థానంలో నిలబడి సర్వాత్మనా సమస్త ప్రపంచానికీ ఒక light house కావాలి. మనం అమ్మకి చాలా ఋణపడ్డాం. అది తీర్చుకునే ఋణం కాదు. మనం ప్రపంచంలో ఎంత మర్యాదగా ఉంటామో అంతకంటే వేయిరెట్లు మర్యాదగా వినయంగా ఈ ప్రాంగణంలో ఉండాలి. ఇక్కడి నుంచి అమ్మ అనుభూతిని ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. దాన్ని గురుతర బాధ్యతగా చేసుకుందాం.

సత్యార్థప్రకాశమానమైనటువంటి స్థాయిలో మనం నడిచి, నిష్కామ కర్మబద్ధులమై అమ్మకి ఎదిగి వచ్చిన బిడ్డలుగా మన ఋణం తీర్చుకుందాం. అమ్మ దేహాన్ని దైవంగా ఒక ఆలయంలో ప్రతిష్ఠించుకున్నాం కనుక ఒక దేవతకి ఇవ్వవలసిన గౌరవాన్ని మర్యాదని మనం అక్కడ ఇద్దాం.

‘సంస్కరింపనేల సంఘమంతటిని
సజ్జనుండ వగుము స్వార్థముడిగి
ఒక్క నీచుడప్పుడుర్విలో తగ్గును’

అన్నట్లు- మన ప్రజ్ఞని జిల్లెళ్ళమూడిలో ఎట్లా వినియోగించగలం అని మనందరం ఒక సమన్వయ స్ఫూర్తితో ఐక్యతా భావంతో ‘అమ్మ’ అనుగ్రహాశీస్సులతో ఆనందగా అందరం కలిసి జీవిద్దాం….

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
Bellamkonda Dinakar

Bellamkonda Dinakar

  శ్రీ బెల్లంకొండ దినకర్   వీరు ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్ళ గ్రామంలో 07-06-1950లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీవెంకటరంగయ్య, శ్రీమతి యశోదమ్మ. భార్య శ్రీమతి సరోజినీ దేవి. సంతానం - ఒక కుమారుడు, ఒక కుమార్తె, విద్య -...

read more
0 Comments
error: Content is protected !!