Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Interviewed by
Ravuri Prasad
27/01/2014
Kakinada

 

శ్రీ బి.యల్.యస్.శాస్త్రి

  వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం – ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం : Planning advisor to Collector, E.G.Dt.

సేవాతత్పరత : 1973 నుంచి అమ్మ సన్నిధికి వస్తూ అమ్మ విశ్వజనీన మాతృప్రేమకు ముగ్ధులై, అమ్మ అపూర్వ తత్త్వానికి అంజలి ఘటించారు. ‘పదార్చన – 3 భాగాలు’, ‘కృష్ణం వందే జగద్గురుం’ (నృత్యనాటిక), ‘బోధేకార్యం కథంభవేత్’, ‘తెలుగులో మహావాక్యం’, ‘అక్షరం వీధిన పడింది’, ‘సబ్రహ్మ స శివస్సహరిస్సోక్షరః’ ‘Mandookyopanishad – a study’ అనే గ్రంథాల్ని రచించి అమ్మ వాక్యాలు ‘తెలుగులో మహావాక్యాలు’ అని ఎలుగెత్తి చాటారు. జిల్లెళ్ళమూడిలోని అమ్మ సేవాసంస్థల నిర్వహణకు ఉదారంగా విరాళాలిచ్చి తమ వంతు సహకారాన్ని అందించారు. SVJP వివిధ స్థాయిలలో నిర్వహణ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి అమ్మ అనుగ్రహాశీస్సులకు పాత్రులైనారు.

శ్రీ రావూరి ప్రసాద్ 27-1-2014వ తేదీన కాకినాడలో శ్రీ బులుసు లక్ష్మీప్రసన్న సత్యనారాయణ శాస్త్రి గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీ కుటుంబ నేపథ్యాన్ని తెలియపరచండి.

మా స్వగ్రామం తూ॥గో॥ జిల్లా రాజోలు. మా నాన్నగారు అష్టావధానం, శతావధానం చేసేవారు. మా అమ్మగారు రెంటచింతల వారి ఆడపడుచు. మేము అన్నవరం సత్యనారాయణ స్వామి వారి భక్తులం. ఏటా సీతారామ కళ్యాణం జరిపేవాళ్ళం. మా నాన్నగారు రెవెన్యూశాఖలో Magistrateగా పని చేశారు. చేబోలు వెంకట్రావు గారి పెద్దమ్మాయి శేషవేణితో నాకు వివాహం అయింది. నాకు నలుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. నేను తూ॥గో॥ జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగం చేశాను.

అమ్మను గురించి మీకు మొదట ఎలా తెలిసింది?

1972లో ఆంధ్రప్రభలో శ్రీ కొండముది రామకృష్ణగారి వ్యాసం చదివిన తర్వాత అమ్మని చూడాలనే భావం కలిగింది.

కాకినాడలో గాత్రం కోటేశ్వరరావుగారింట్లో ప్రతీ ఆదివారం సాయంకాలం అమ్మ పూజ జరుగుతుందని విని వారింటికి వెళ్ళాను. వారు నాకు అమ్మను గురించి చెప్పి ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ గ్రంధాలు ఇచ్చారు. అవి చదివాను. తర్వాత అమ్మను దర్శించుకోవాలనే తహతహ మొదలైంది.

అనంతరం నాకు స్వప్నంలో మహోన్నత పీఠ సంస్థితగా అమ్మ అద్భుత దర్శనాన్ని అనుగ్రహించింది.

అమ్మను మీరు మొదటిసారి ఎపుడు దర్శించారు?

1972లో Andhra agitation వచ్చింది. ఎక్కడికీ కదిలే పరిస్థితి లేదు. 1973లో మాతృశ్రీ స్వర్ణోత్సవాల గురించి తెలిసింది. BGK శాస్త్రిగారు, గాత్రం కోటేశ్వరరావుగారు, తాడంకి రామదాసుగారు మొదలగు సోదరులం కలిసి ‘లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం పెడతారట, మనకి చేతనైనది చేద్దాం’ అనుకున్నాం. అసలు ఇది ఎలా సంభవమో చూడాలని జిల్లెళ్ళమూడి చేరుకున్నాను. జిల్లెళ్ళమూడిలో అద్భుతమైన ఏర్పాట్లు – అన్నం, పులిహోర, సాంబారు, పెరుగు ఆహారపు రాశుల్ని చూసి నాకు మహదానందం కలిగింది. ఉదయం 10 గం.లకి భోజన పందిళ్ళన్నీ ఖాళీగానే ఉన్నాయి. గంట వ్యవధిలో పందిళ్ళు అన్ని నిండిపోయాయి. ఉ॥గం. 11.30లకి జీపులో అమ్మ వచ్చింది. ఒక పందిరిలో నేను వడ్డన చేస్తున్నాను. అమ్మ జీపు నేరుగా వచ్చి అక్కడ ఆగింది. నేను నీటి జగ్ క్రింద పెట్టి అమ్మకు నమస్కరించుకున్నా. అమ్మ నావైపు చూసింది. అమ్మ వదనమండలం ఊదారంగులో దీపిస్తోంది. ఆమె ఉజ్జ్వలమైన ఆధ్యాత్మిక ఉన్నతి పొందినదని అర్థమైంది. ఆ క్షణం నుంచి అమ్మకి నేను కింకరుణ్ణి అయ్యాను.

తర్వాత చాల సందర్భాల్లో జిల్లెళ్ళమూడి వచ్చాను. ఒకసారి అమ్మ దర్శనం ఇస్తోంది. నేను కన్ను ఆర్పకుండా అమ్మ వైపే చూస్తున్నాను. ‘అమ్మకు పూజ చేసుకోండి’ అన్నారు కొండముది రామకృష్ణ. అది నా అదృష్టం. భోజనాలు అయిన తర్వాత మేమంతా మళ్ళీ అమ్మ సన్నిధిలో కూర్చున్నాం. ‘అమ్మా! నిన్ను కాకినాడ రమ్మని ఆహ్వానించటానికి వచ్చామమ్మా’ అన్నారు మాతో ఉన్న గాత్రం కోటేశ్వరరావుగారు. అమ్మ, “నాన్నా! నేనే కబురు చేసి వద్దామనుకుంటున్నాను” అన్నది. మాకు మహదానందం కలిగింది. ఆ రాత్రి ఆరు బయట మంచం మీద అమ్మ కూర్చున్నది. మాలో ఒకరైన చోడిశెట్టి వీరభద్రరావుగారు సాధారణ కెమెరాతో ఫోటోలు తీస్తున్నారు. అక్కడే ఉన్న సోదరుడు లాలా (శ్రీ లక్కరాజు సత్యనారాయణ) ‘అమ్మా! వెలుతురు లేకుండా మామూలు కెమెరాతో ఫోటోలు వస్తాయా?’ అని అడిగాడు. అందుకు అమ్మ నవ్వుతూ “కావాలా?” అన్నది. కానీ, ఆరోజు ఆయన తీసిన ఫోటోలు అద్భుతంగా వచ్చాయి.

‘అమ్మా! నేను మాండుక్యం మీద కొంత కృషి చేశాను. దీనిని నువ్వు స్పృశిస్తే ప్రచురించాలనుకుంటున్నాను’ అని ఆ నా వ్రాతప్రతిని అమ్మ చేతిలో ఉంచాను. అమ్మ ఆ పుస్తకం తెరచి ఉపోద్ఘాతంలో కొన్ని వాక్యాలు చదివింది. “నాన్నా! దీంట్లో వారి వారి అభిప్రాయాల్ని చెప్పావు. నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగింది. ‘నువ్వే చెప్పాలమ్మా’ అన్నాను. “నాన్నా! గంజాయి మొక్క ఉంది, తులసి మొక్క ఉంది. ఈ రెండూ వేరంటావా?” అని అడిగింది. దాంతో నాకు అర్ధమై ‘అంతా ఆత్మేనమ్మా’ అన్నాను. మాండూక్యం చెప్పేది అదే అదే దీంట్లో వ్రాశావా, నాన్నా?” అన్నది. ‘అవునమ్మా’ అన్నాను. తర్వాత ఆ గ్రంథాన్ని అమ్మకే అంకితం ఇచ్చి అచ్చువేయించా.

అమ్మతో మీరు ఏమైనా సంభాషణలలో పాల్గొన్నారా?

అమ్మతో పలు సంభాషణలు చేశా. అమ్మ జీవిత చరిత్ర చదివి పలు సంఘటనల్ని ఆకళింపుచేసుకున్నా. అమ్మను గురించి అవగాహన కలిగింది. అమ్మ అంటే అనంతశక్తి. ఆశక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నది. అట్టి అమ్మను ఈ చర్మ చక్షువులతో దర్శించటమే కాకుండా మనోనేత్రంతో దర్శించాలి. తర్వాత జిల్లెళ్ళమూడిలో ఎంతో మందితో నాకు పరిచయాలు పెరిగాయి. మా ఇంట్లో అమ్మ పూజలు చేసుకునేవాళ్ళం. కాకినాడలో మా పేటలో వాళ్ళంతా వచ్చి పాల్గొనేవారు ఆ పూజల్లో, కాకినాడలో శ్రీచాగంటి వెంకట్రావుగారు అమ్మ అమ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేసిన మహానుభావుడు. ప్రతీ ఆదివారం వారు బాలాత్రిపుర సుందరీ ఆలయంలో కూర్చొని వచ్చిన వారందరిచేత నామం చేయించి ప్రసాదాలు పంచేవారు. నేను కూడా వెళ్ళి ఆ సంకీర్తనలో పాల్గొనేవాడిని.

అమ్మలో మీరు గమనించిన విశేష లక్షణాలేమిటి?

జిల్లెళ్ళమూడిలో ఏం జరుగుతోంది? శ్రోత్రియులు ఆచార పరుల సరసన అంత్యజులన్నవారిని కూర్చుండబెట్టి అన్నం పెట్టింది ఆ మహాతల్లి. ఇది జిల్లెళ్ళమూడిలో జరిగినటువంటి అద్భుతమైన నిశ్శబ్ద సాంఘిక విప్లవం. పసిపిల్లల్ని అమ్మ చేతికి అందిస్తే స్వంత బిడ్డల్లా ముద్దుచేసింది; వాళ్ళ తల్లులు వాళ్ళని తీసుకుందామంటే తిరిగి వచ్చేవారు కారు. సర్వులనూ సర్వాన్నీ సమంగా లాలించింది. అమ్మ చేతి అన్నం ముద్ద తినే భాగ్యం నాకు కలిగింది. నాకది చాలు. దేవాలయాలకు సరసన అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయాలనే నాలుగు సాంఘిక సేవా సంస్థలను స్థాపించింది. పిల్లలు, యువకులు, వయోజనులు, వృద్ధులు- నాలుగు రకాలవారికీ అవసరాల్ని తీర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన మహాతల్లి అమ్మ. మానవాభ్యున్నతికి ఇంతకన్న ఏం కావాలి? లౌకికంగాను, ఆధ్యాత్మికంగాను అన్ని అవసరాల్ని తీర్చింది. ‘యతో వాచో నివర్తనే అప్రాప్య మనసాసహ’ అని వేదం వర్ణించే మాటలకి కూడా అందని మహత్తరశక్తి అమ్మ.

మీరు తెలుసుకున్న అమ్మతత్త్వం ఏమిటి?

శంకరుల దక్షిణామూర్తి స్తోత్రఫలశృతి ‘సర్వాత్మత్వమితి శ్లోకాన్ని అర్థం చేసుకుంటే అంతా ఆత్మే అనేది ధృవపడుతుంది. “అంతా అదే, నాన్నా!” అని అమ్మ చెప్పినదీ అదే. “నేను నేనైన నేను” అని అమ్మ స్వస్వరూపాన్ని ఆవిష్కరించింది. అది తెలుగులో మహావాక్యం. అమ్మ తెలుగుభాషను సుసంపన్నం చేసింది. “అన్ని నేనూలూ నేనైననేను” అనీ చెప్పింది. ఈ రెండు వాక్యాలు సమస్త ఆధ్యాత్మిక భావ సంపత్తిని ఇనుమడింపజేశాయి.

మీ రచనల గురించి తెలుపండి?

ఆ దృష్టితోనే ‘తెలుగులో మహావాక్యం’ అనే గ్రంధం వ్రాశాను. అమ్మ మీద ఎన్నో గ్రంథాలు వ్రాసాను. నేను రచించిన ‘పదార్చన’ 3 భాగాలుగా వచ్చింది. ‘Mandookyopanishad – a study అనే గ్రంథం, పాదుకాపట్టాభిషేకాన్ని ‘CORONATION OF THE SANDAL’ అనే dramaగా రచించాను. తెలుగులో ఎన్నో గ్రంధాలు, నవలలు రాసాను. అన్ని గ్రంధాల్లో అమ్మ మహత్తరశక్తి తత్త్వాన్ని గురించే ప్రస్తావించాను. ఇటీవల ‘బోధే కార్యం కథం భవేత్’ అనే గ్రంధాన్ని వ్రాశాను. అది విశ్వజననీ పరిషత్వారే ప్రచురించారు.

అమ్మ వాక్యాలు ఆచరణ సాధ్యాలేనా?

అమ్మ వాక్యాలు వారివారి యోగ్యత, పాత్రతని బట్టి ఆచరణ సాధ్యం అవుతాయి.

మీ దృష్టిలో ఇటీవల కాలంలోని మహాత్ముల గురించి వివరించండి.

నా అల్ప పరిజ్ఞానంలో ఐదారుగురు మహితాత్ములుద్భవించారు రామకృష్ణ పరమహంస, షిర్డీసాయిబాబా, రమణమహర్షి, ముమ్మిడివరం బాలయోగి, అమ్మ. బాలయోగి చివరిసారిగా మూడు మాటలు చెప్పారు సందేశాత్మకంగా- ‘ఇది ఆఖరు జన్మ. తిరిగిరాను. చెప్పటానికి ఏమీలేదు’ అని. శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, శృంగేరి శ్రీ చంద్రశేఖర భారతీ స్వాముల వారు మహానుభావులు.

అమ్మ మద్రాసు పర్యటనలో గుడిపాటి వెంకటచలం గారిని చూడటానికి తిరువణ్ణామలై వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో రాత్రి 12 గంటలకు కలవై గ్రామం వచ్చింది. అక్కడ కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు ఉంటున్నారు. అమ్మ స్వామివారిని దర్శించాలని అడిగింది. ‘స్వామి వారు ఆడవారికి దర్శనం ఇవ్వరు అందునా అర్థరాత్రి’ అన్నారు అక్కడి ఆశ్రమవాసులు. “నేను వచ్చానని చెప్పండి స్వామివారికి” అని అమ్మ కబురు చేసిందట. ఆ కబురు అందిన వెంటనే స్వామి దండం కమండలంతో సహా వచ్చి బల్లమీద నిలబడి, రెండు చేతులూ జోడించి పదిహేను నిముషాలు అమ్మను చూస్తూ ఉండి పోయారు. అమ్మ ప్రక్కనే ఉన్న శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారు, ‘అమ్మా! ఆయన పెద్దవారు – వారిని కూర్చోమను’ అన్నారట. “నేనిక్కడ ఉన్నతం సేపు ఆయన కూర్చోరు. వచ్చినపనైంది. ఇక వెళ్ళిపోదాం పద” అన్నదిట అమ్మ.

అతఃపూర్వం అమ్మ వద్ద చాలా చనువుగా మెసిలే వాడిని. కానీ ఈ సంఘటన విన్న తర్వాత అమ్మ దగ్గరకి వెళ్ళటానికి నాకు భయం వేసింది. స్వామి జగద్గురువులు, పూజ్యులు. వారు అమ్మకి నమస్కరిస్తూ నిలబడిపోయారని తెలిసిన తర్వాత నా మానసిక స్థితి గ్రహించి అమ్మ ఒకసారి “ఏం లేదు, నాన్నా! వచ్చి కూర్చో” అని ఎంతో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుంది తదనంతరకాలంలో.

అమ్మ ఈ జగతికిచ్చిన సందేశం ఏమైనా ఉన్నదా ?

“నీకు ఇచ్చింది తృప్తిగాతిని, ఇతరులకు ఆదరంగా పెట్టుకో” అనేది అమ్మ గొప్ప సందేశం ప్రపంచానికి. ఇది ఆచరణ సాధ్యమే. సామాన్య ప్రవృత్తి రేపటి కోసం దాచుకోవటం; ఎవరికైనా పెడితే అయిపోతుందేమోనని లుబ్ధత్వం. రావాల్సింది వస్తుంది. కానీ వెంపర్లాడతాం. తృప్తిగా అనుభవించడమ చేతకాదు. తృప్తి లేకే మానవుడు దుఃఖిస్తున్నాడు. “తృప్తే ముక్తి” అనేది అమ్మ అనుగ్రహించిన మహత్తర సందేశం.

ఇటీవల (2012లో) మీ పెద్దకుమారుని హఠాన్మరణ దుఃఖాన్ని మీరు ఎలా అధిగమించారు?

అదీ అమ్మ అనుగ్రహమే. మానవ జీవితాల్లో సుఖదుఃఖాలు, ఎండమావులు అన్నీ ఉంటాయి. భూమి తిరుగుతుంటే ఒక ప్రాంతానికి వెలుతురు, ఒక ప్రాంతానికి చీకటి ఉంటుంది ఒకే సమయంలో. అలాగే మానవ జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి. వాటికి అతీతమైన స్వస్వరూప ఆనందస్థితి లభిస్తే తప్ప వాటికి అతీతంగా ఉండే స్థితి సామాన్యులకు సాధ్యంకాదు. గ్రహించుకుని జీవిస్తారు అదృష్టవంతులు.

అమ్మే నాకు ఒకదారి చూపింది. 1980 దశకంలో ‘ధర్మ విద్యామహోదధి’ ‘న్యాయవేదాంతాచార్య’ శ్రీ రాణినరసింహశాస్త్రి గురుదేవుల చరణ సన్నిధిలో ప్రస్థానత్రయ భాష్యం వినే అదృష్టం నాకు కలిగింది. అది అమ్మ అనుగ్రహమేనని అప్పట్లో నాకు తెలియదు. ఒకసారి అమ్మ ఉన్నట్లుండి “శంకరుడు చాలా తెలివైనవాడు నాన్నా!” అన్నది. ‘ఆయన మహామేధావి, అమ్మా!’ అన్నాను. ఇంతలో ఎవరో దర్శనం కోసం వచ్చారు. అంతతో ఆ సంభాషణ ఆగిపోయింది.

అమ్మ అనుగ్రహించిన ప్రస్థానత్రయ భాష్య శ్రవణయోగం వలన నాకు వాటిల్లిన పుత్రవియోగ విషాద ఘట్టం నుండి తట్టుకునే శక్తి మానసికంగా కలిగింది. నా వలెనే జ్యేష్ఠపుత్రుని పోగొట్టుకున్నారు శ్రీ PSR ఆంజనేయ ప్రసాద్. అతనికీ అటువంటి మానసిక శక్తిని ప్రసాదించింది అమ్మ. ఇవాల్టికీ మనుష్యులుగా బ్రతికి ఉన్నాం అంటే అమ్మ అనుగ్రహమే. దుఃఖం లేదా అంటే మేము ఉన్నంత కాలం ఉంటుంది. జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులు అందరికీ మా అబ్బాయి గురించి తెలుసు. వాడి గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. నేను జిల్లెళ్ళమూడిలో ఎక్కువగా చేసే సేవా కార్యక్రమాలకి వాడు ఎంతగానో సహకరించాడు. ‘నాన్నా! ఈ పనికి లక్ష రూపాయలు ఇవ్వరా’ అని అంటే ‘ఎందుకు, నాన్నగారూ?’ అనే ప్రశ్న వాడు ఎప్పుడూ వెయ్యలేదు నన్ను. నా జీవిత శోభ వాడు.

అమ్మ కుమార్తె హైమక్కను మీరు చూశారా ?

హైమాలయ ప్రాంగణంలో అనేకసార్లు అమ్మ నామం చేశాను. రెండు ఆలయాల్లో అభిషేకాలూ లక్ష పత్రిపూజలు చేసుకున్నాను. హైమ అక్కయ్యను నేను చూడలేదు, కానీ విన్నాను. హైమకి అమ్మ పరిపూర్ణత్వాన్నిచ్చి జీవసమాధి చేసిందని.

హైమ ఆలయ ప్రవేశం చేసిన తదనంతరం భద్రాద్రి రామశాస్త్రిగారిచే మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా విధానాన్ని ప్రవేశపెట్టిన అమ్మ, సనాతన ధర్మాచరణకి నిలువెత్తు ఆదర్శం అనుకున్నాను. సనాతనం అంటే పురాతనం అని కాదు. ఆద్యంతాలు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది – అని అర్ధం. వైదిక సిద్ధాంతాన్ని అమ్మ ఆచరణలో చూపింది.

అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరగారిని చూశారా? వారితో మీ అనుబంధాన్ని తెలపండి.

జిల్లెళ్ళమూడి ‘నాన్నగారిని’ నేను చూశాను. వారు ‘మనమంతా రెవిన్యూ శాఖలోనే పనిచేస్తున్నాము. నేను జిల్లెళ్ళమూడి కరణంగా రావటం వలన మీ అమ్మగారు జిల్లెళ్ళమూడి అమ్మగారైంది’ అంటూ చనువుతో కూడిన అప్యాయంగా మాట్లాడేవారు. నాన్నగారు అమ్మ పతిదేవులు, మహానుభావులు. ఆయన్ని గురించి ఎప్పుడూ ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడకూడదు.

అమ్మను గురించి భావితరాల వారికి మీరిచ్చే సందేశం ఏమిటి?

‘అమ్మ జన్మలు లేవు అని అన్నది’ అనే మాట ఉన్నది. ఈ మాటను పలుమంది పలురకాలుగా అర్థం చేసుకుంటున్నారు. జన్మలు లేవు అంటే దేనికి? శరీరానికా? లోపల ఉన్నదానికా? ఈ శరీరం పంచభూతాత్మకం. ఇది మళ్ళీ అదే ఆకారంతో పుట్టదుగా! లోపల ఉన్నవాడు గూడు అల్లుకుంటే వచ్చింది ఈ శరీరం. గొంగళి పురుగు గూడు అల్లుకున్నట్లుగా లోపల ఉండే చైతన్యం ఒక గూడు అల్లుకుంటోంది ద్వంద్వానుభవం కోసం. ఈ శరీరానికి జన్మలు లేవు. తెలిస్తే లోపల ఉన్నదానికీ జన్మలు లేవు. జన్మలు లేవు అనే దానికి ఒక Rider ఉంది, దానిని చెప్పరు- ‘తెలిస్తే’ అనే మాటని వదిలేస్తారు. జన్మలు లేవన్నది అని ప్రచారం చేస్తారు. అది చాలా తప్పు. తెలిస్తే అంటే – జ్ఞాని అయితే జన్మలు లేవు. లేకపోతే ఆ లోపలి చైతన్యం రకరకాల అనుభవాలు పొందాలి. “అందరికీ సుగతే, కాస్త వెనకాముందూ” అన్నది అమ్మ. వెనుకాముందూ అంటే యుగాలు కావచ్చు! జగాలలో యుగాలు మారుతాయి.

అమ్మేమో ‘మహాతల్లి!’ మన మనస్సేమో చిన్న కొలబద్ద. అది ‘అనంతాన్ని ‘ గ్రహించలేదు. ‘అనంతాన్ని తెలుసుకోవాలంటే అనంతమే అవ్వాలి. దేవుని తెలుసుకోవాలంటే దేవుడే అవ్వాలి; మరొక దారి లేదు.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bellamkonda Dinakar

Bellamkonda Dinakar

  శ్రీ బెల్లంకొండ దినకర్   వీరు ప్రకాశం జిల్లా కంభం మండలం తురుమెళ్ళ గ్రామంలో 07-06-1950లో జన్మించారు. తల్లిదండ్రులు శ్రీవెంకటరంగయ్య, శ్రీమతి యశోదమ్మ. భార్య శ్రీమతి సరోజినీ దేవి. సంతానం - ఒక కుమారుడు, ఒక కుమార్తె, విద్య -...

read more
0 Comments
error: Content is protected !!