ఒకసారి నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. నేనింక బ్రతకనేమో అనుకున్నాను. అమ్మ నామమే చేసుకుంటున్నాను. అర్థరాత్రి గోడమీద మాయింట్లో అమ్మ కనపడింది. నా వేదన ఇలా విన్నవించుకున్నాను. ‘అమ్మా! నేను బ్రతకనేమో! నీ దగ్గరకి రాలేనేమో! పిల్లలు చదువుల్లోనే ఉన్నారు. ఇలా మంచాన పడ్డాను. లేవగలనా, లేదా? ఆయాసం బాగా ఉంటోంది’ అంటూ అలాగే ఎలాగైనా అమ్మ దర్శనం చేసుకొని నా బాధ చెప్పుకోవాలని జిల్లెళ్ళమూడి బయలుదేరాం. నా పర్సు నేను పట్టుకోలేకపోయాను. మా వారే సంచులు మోసుకొచ్చారు. తెల్లవారితే కొత్త సంవత్సరం – అమ్మ వద్ద జనం పుట్టలు, పుట్టలు. ఇంతలో ఎవరో వచ్చి అడిగారు. ‘రాధక్కయ్య ఎవరు?’ అని. నేనే అన్నాను. ‘అమ్మ మీకు కాఫీ పంపించింది’ అని వేడి కాఫీ అందించారు. నేను కాఫీ తాగను; టీ అలవాటు. అయినా అమ్మ పంపింది ప్రసాదం అని త్రాగా. పైగా అంతమందిలో నా కోసం పంపింది. ఆ తర్వాత అమ్మ మేడ పైకి వెళ్ళా. “ఏమమ్మా! ఇంతదూరం ప్రయాణం చేసి మెట్లక్కి వచ్చావా! సరే. ఇక్కడే నా మంచం దగ్గర పడుకో” అన్నది. అప్పటికే కొంచెం ఆయాసం తగ్గింది. తర్వాత నా రూమ్ కొచ్చేశాను.
పిల్లలకి వేసవిసెలవులు. మావారు జిల్లెళ్ళమూడిలో ‘శ్రీమాతా’ భవన నిర్మాణ పనుల్లో ఉన్నారు. ‘అమ్మా ! నేను ఇక్కడ ఉండవచ్చా?’ అని అడిగాను. “తల్లిని అడగకూడదు. బిడ్డలు ఉంటానంటే నేను కాదంటానా? నా దగ్గర పిల్లలుంటేనే నాకు ముచ్చట. తప్పకుండా ఉండవచ్చు” అన్నది. అలాగే పిల్లలతో ఉండిపోయాను అమ్మ వద్ద.
ఆరోజులలో ఒకనాడు “నీకు ఒంట్లో బాగా లేదు కదా! నువ్వు నేను చెప్పిన మందు తీసుకుంటావా?” అని అడిగింది అమ్మ. ‘తప్పకుండా తీసుకుంటానమ్మా; తగ్గాలేకానీ’ అన్నాను. “దేశవాళీ కోడిగుడ్లు అమ్ముతారు. నువ్వు మందులా రోజూ ఒకటి నోట్లో వేసుకో” అన్నది. ‘అమ్మో! ఇదా మందు? అది మాత్రం వేసుకోను. బ్రాహ్మణులు వేసుకోవటం ఏమిటి?’ అన్నాను. మావారు వచ్చాక కూర్చోబెట్టి “ఇది మందులవల్ల తగ్గేది కాదు. ఇదిగో చూడు. దీనికి నరాలన్నీ పొంగిపోయాయి. ఇంజక్షన్స్ అన్నీ అయిపోయాయి. రోజూ ఒక దేశవాళీ గుడ్డు తీసుకుంటే తగ్గుతుంది” అని నచ్చచెప్పింది. సరే. అమ్మ చెప్పిందిగా. ‘అమ్మా! నీ చేత్తో ఇస్తేనే వేసుకుంటాను’ అన్నా. సరేనని అమ్మ నా నోట్లోవేసింది. భగవంతుడే ఇస్తున్నపుడు అది మాంసాహార మెట్లా అవుతుంది? అనే నా భావన. అలా కొన్నాళ్ళకి రోగం ఎక్కడికో కనిపించకుండా పోయింది. అలా అమ్మ నా రోగం బాగు చేసింది.
ఒకరోజు అర్థరాత్రి సమయం. నాకు బాగా తేడా వచ్చింది. నేను జిల్లెళ్ళమూడిలోనే వున్నాను. ఎవరితోనో అమ్మ కబురు చేసింది- “రాధను పంపించమని. రాత్రి 2 గంటలు అయింది. అమ్మ ఆరుబయట వెన్నెలలో మంచం మీద పడుకుని ఉంది – ఇపుడు ధ్యానమందిరం ఉన్న చోట. “రాధా! వచ్చావా! రా!” అని పిలిచింది. నా పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో గ్రహించిన అమ్మ తన తలగడమీద పడుకోబెట్టి జోకొట్టి వీపురాసి ఇంకా ఏం చేసిందో ఆ తర్వాత తెలియదు. నాకు హాయిగా నిద్రపట్టింది. తెల్లవారింది. లేచి చూశాను. “ఇంక నువ్వు నీ గదికి వెళ్ళవచ్చు” అన్నది. అదే అమ్మ ఇచ్చిన మందు. ఏ డాక్టరూ తెలియదు ఆ treatment, course. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను తిరిగి చూడలేదు, ఆ రోగం నశించింది.
ఒకసారి ‘అమ్మా! చచ్చిపోవాలని ఉంది’ అన్నాను. ‘ఏమిటి? పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యవా? నీదీ ఒక కష్టమే ? ఇంత కన్న కష్టాలున్నవాళ్ళు చాలమంది ఉన్నారమ్మా. నీకు ఆరోగ్యం బాగా లేదనేది ఒక కష్టమే కాదు” అని ధైర్యానిచ్చి అప్పటికీ, ఇప్పటికీ నా జీవితాన్ని వెన్నంటి అమ్మ నడిపిస్తోంటేనే నడుస్తున్నా!
0 Comments