Kondamudhi Bala Gopala Krishna Murthy

Interviewed by
Ravuri Prasad
18/10/2011
Jillellamudi

 

శ్రీ గోపాలన్నయ్య ( కె. బి. జి. కృష్ణమూర్తి )

 

వీరు 25-04-1932 తేదీన జన్మించారు. గుంటూరుజిల్లా, బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామం వీరి స్వస్థలం. తల్లిదండ్రులు శ్రీ కొండముది లక్ష్మీనారాయణ, శ్రీమతి వరలక్ష్మి, భార్య – శ్రీమతి వెంకాయమ్మ. సంతానం- ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. విద్య – S.S.L.C.

సేవాతత్పరత: మాతృశ్రీ పబ్లికేషన్స్, యస్.వి.జె.పి. కార్యకలాపాలు, అమ్మ, చలనచిత్ర నిర్మాణ బాధ్యతలతో పాటు, నేటికీ తమ 90వ పడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అమ్మను త్రికరణశుద్ధిగా సేవిస్తున్నారు. ‘అమ్మ సన్నిధిలో నా అనుభవాలు – జ్ఞాపకాలు’, ‘అమ్మ తత్త్వదర్శనం’ వీరి రచనలు.

వీరు 21-10-2017న జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రంలో అమ్మలో ఐక్యమైనారు.

శ్రీ రావూరి ప్రసాద్ 18-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ కె.బి.జి.కృష్ణమూర్తి గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీ తొలి అమ్మదర్శనం - నాటి జ్ఞాపకాలు తెలియజేయండి?

మా ఊరు బాపట్ల సమీపాన అప్పికట్ల. అక్కడ జరిగే సప్తాహాలకి అమ్మ కూడా వస్తూండేది. వాటిని రఘువరదాసు గారు నిర్వహించేవారు. (అమ్మ మరిది) లోకనాధం బాబాయి అప్పికట్లలో టీచర్ పని చేస్తూండేవారు. అమ్మ వారింటికి వచ్చేది. 1950 లో మొదటిసారి అమ్మను నేను అక్కడే చూశాను. అమ్మ పెద్దకుమారుడు సుబ్బారావు అప్పికట్లలో చదువుతూండేవాడు. అప్పటికి అమ్మ లోకనాధంగారి వదినెగా, సుబ్బారావు తల్లిగా మాత్రమే నాకు తెలుసు. ఆ సందర్భంగా ఒకరోజు నేను, నా సోదరుడు రామకృష్ణ కలిసి వస్తుంటే ఒకచోట అమ్మ కనిపించింది. అమ్మని కొండముది రామకృష్ణ పలకరించాడు. వాడే నన్ను అమ్మకు పరిచయం చేశాడు. అదే అమ్మను తొలిసారి నేను దర్శించటం.

మొదటిసారి మీరెపుడు జిల్లెళ్ళమూడి వచ్చారు? ఆనాటి మీ దర్శనానుభూతు లేమిటి?

ది 15-8-1960న నేను, రామకృష్ణ ఇద్దరం మొదటి సారి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అక్కడేదో ఒక ఉత్సవం జరుగుతోంది. అమ్మ దర్శనానంతరం ప్రయాణమై 7వ మైలురాయి త్రోవలో మొదటి ఒరవ దాకా వచ్చాం. ఒక పిల్లవాడు మావెనుక పరుగెత్తుకుంటూ వస్తూ ‘అప్పికట్ల పిల్లలు అమ్మగారు పిలుస్తున్నారండీ. వెనక్కి రమ్మన్నారు.’ అని చెప్పాడు. తిరిగి వెనక్కి వెళ్ళాం. అమ్మ పర్ణశాల ప్రక్కనే ఒక వేదిక మీద కూర్చున్నది. అంథసోదరుడు శ్రీ సిరిగిరి సుబ్బారావు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఆర్ద్రతతో పాడుతున్నాడు. అమ్మకూర్చున్న బల్లకి చెరియొక వైపు మేం నిలబడ్డాం. తర్వాత అందరి భోజనాలు అయ్యాయి. అక్కడ పిల్లలు, పెద్దలు అందరూ ఏదో ఒక పనిచేస్తున్నారు. నేను రామకృష్ణతో ‘మనకు చేతనైన పనిని మనం కూడా చేస్తే బాగుంటుందేమో’ అన్నాను. ఆ రోజుల్లో మాకు బాపట్లలో పుస్తకాలషాపు ఉండేది. ‘అమ్మ మీద సాహిత్యం తెస్తే బాగుంటుందేమో’ అన్నాను. వాడు ‘సరే’ అన్నాడు. రాజుబావ పాటలు అప్పుడే కొత్తగా వింటున్న రోజులవి. వాటిని గ్రంధరూపంగా తీసుకుని రావాలనిపించింది నాకు.

అమ్మ సాహిత్య ప్రచురణ పరిణామ క్రమం ఏమిటి?

1962 సంవత్సరము అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక సంవత్సర సంచిక- సావనీర్ ను తీసుకు వద్దామనుకున్నాము. బ్రహ్మాండం సుబ్బారావు, PSR ఆంజనేయప్రసాద్ సహకారంతో రచనలు సేకరించాం. మా ‘అత్రివాణి’ ప్రెస్లోనే ప్రత్యేక సంచిక ప్రచురించి అమ్మకు సమర్పించాం. అది మొదలు 1963 నుండి 1966 వరకు మేము ఏటా అమ్మ జన్మదినోత్సవ ప్రత్యేక సంచికను ప్రచురించి ‘అమ్మ’కు సమర్పించాం. 1966లో అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య ‘ఈ పత్రిక చాలా బాగుంది. దీనిని మాస పత్రికగా తీసుకువద్దాం. దాని ఖర్చు బాధ్యత నేను చూస్తాను. ప్రచురణ బాధ్యత మీరు తీసుకోండి’ అన్నారు. మేము అంగీకరించాం. అప్పటి నుంచి ‘మాతృశ్రీ’ మాసపత్రిక వెలువడింది. 1968 వరకు శేషగిరిరావు అన్నయ్య ప్రొప్రయిటర్గా, మాతృశ్రీ పబ్లికేషన్స్ పేర ఆ పత్రిక ప్రచురించాం. ఆ తర్వాత నన్ను మేనేజింగ్ ట్రస్టీగా, మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్, మాతృశ్రీ ప్రింటర్స్ సంస్థలుగా రూపుదిద్దారు. శ్రీ కొండముది రామకృష్ణ, డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, శ్రీ తంగిరాల కేశవశర్మ, ట్రస్టీలుగా ఉన్నారు. నాటి నుంచి రామకృష్ణ ఎడిటర్గా ‘మాతృశ్రీ’ తెలుగు, భరద్వాజ ఎడిటర్ Matrusri English మాసపత్రికలు నిరాటంకంగా వెలువడసాగాయి.

తర్వాత కారణాంతరాల వల్ల ఆ పత్రికలు ఆగిపోయాయి. 1999 నుంచి హైదరాబాద్ సోదరులు ‘Mother of All’ అనే త్రైమాసిక పత్రికను ప్రచురించసాగారు. 2000 నుంచి ‘మాతృశ్రీ’ స్థానే ‘విశ్వజనని’ అమ్మ మాసపత్రికను PSR ఆంజనేయప్రసాద్ ఎడిటర్గా, నేను Managing Editor గా మళ్ళీ ప్రారంభించాం. నేటివరకు అవిచ్ఛిన్నంగా ప్రచురితమౌతోంది. మాతృశ్రీ పబ్లికేషన్స్ తరఫున ‘అమ్మ’పై సాహిత్యపరంగా ఎన్నో గ్రంధాలను ప్రచురించాం. అలా సాహిత్యసేవలో పాల్గొనటం నా అదృష్టం.

అమ్మతో సన్నిహితంగా మెసిలే అవకాశం ఎలా కలిగింది ?

అమ్మ ఒకసారి “నువ్వు రామకృష్ణతో పాటే రావాల్సిన అవసరం లేదు. ఇవాళ రాత్రికి ఒక్కడివేరా” అని నాకు బాపట్లకి కబురు చేసింది. రాత్రి 9.00లకి మా Book shop కట్టేసిన తర్వాత నేను బయలుదేరాను. 7 వ మైలు వద్ద దిగాను. అపుడు రోడ్డు లేదు; డొంకే- అన్నీ పొదలు, గుట్టలు. చీకటి. ఏం చేయాలో తెలియక నిలబడ్డాను. ఆ డొంకలో సన్నటి తెల్లటిదారి కనిపించింది. క్రమంగా ఆ వెలుగులో నడచి అమ్మ వద్దకు వచ్చా. అమ్మ అన్నం కలిపి తినిపించింది; “రామకృష్ణని- నీకు ప్రాణస్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే నీ పేరు చెప్పాడు. అందుకు పిలిపించాను. మొన్న ఎక్కిరాల వేదవ్యాస్ ఇక్కడికి వచ్చాడు. రామకృష్ణని చూసి – ఈ అబ్బాయి ఎవరో కానీ ఎక్కువకాలం బ్రతకడమ్మా! వాని ముఖం చూస్తే నాకు అనిపించింది – అన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మకీ విషయం తెలియచెయ్యి ” అని చెప్పింది. ఈ విషయాన్ని నా శ్రేయోభిలాషి చుండూరి రాఘవయ్యగారికి చెబితే ‘రుద్రాభిషేకాలు చేస్తే ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు’ అన్నారు. అప్పికట్ల వెళ్ళి రామకృష్ణ వాళ్ళ అమ్మతో విషయం చెప్పా. ఈ కుటుంబాన్ని దురదృష్టం ఇంకా పట్టిపీడిస్తోందే – అంటూ ఆమె వలవలా ఏడ్చింది. అందుకు కారణం రామకృష్ణ వాళ్ళ తాత, నాన్న అందరూ 30 ఏళ్ళ వయస్సులోనే పోయారు. రామకృష్ణతో విషయం చెప్పి ‘అప్పికట్ల లేక బాపట్ల శివాలయాల్లో అభిషేకం చేద్దాం’ అన్నాను. ‘చేస్తే అమ్మ పాదాలకే చేస్తాను నేను మరి ఎక్కడకూ రాను’ అన్నాడు రామకృష్ణ.

తర్వాత కుమారస్వామి మందిరంలో వేదికపై అమ్మకి అభిషేకాలు ప్రారంభించాం. 11 వారాలు చేశాం. మొదటిసారి అమ్మకి రుద్రాభిషేకం. జరుగుతుంటే చూస్తూ నేను ప్రక్కనే నిలబడి ఉన్నాను. ఆ అభిషేకం నాకే జరిగినట్లు అనుభవమైంది. కేవలం భావావేశం కాదు. బుంగ నీళ్ళు నెత్తిన కుమ్మరిస్తే ఎట్లా ఉంటుందో అలాంటి అనుభవం అయింది నాకు. క్రతువు అయిన తర్వాత ఋత్విజుడు శ్రీరామలింగసోమయాజి అమ్మతో ‘నేను కాశీ రామేశ్వరాల్లో ఎన్నో శివాలయాల్లో అభిషేకాలు చేయించాను. కానీ ఇవాళ ఇక్కడ నేను ఎక్కడా పొందని ఆనందానుభూతి పొందానమ్మా’ అన్నారు. అభిషేకం నిమిత్తం కన్యాకుమారి వెళ్ళి మూడు సముద్రాలు కలిసే చోట నుంచి జలం తెచ్చాను.

అలా 11 వారాలు వరుసగా అమ్మ దగ్గరికి వచ్చాను. పగలు బాపట్ల మా shop లో ఉండి రాత్రి పూట వచ్చేవాడిని. ఆ సమయంలో అమ్మ ‘స్వీయచరిత్ర’ విశేషాలు చెప్పింది. అప్పటికింకా అమ్మ జీవిత చరిత్ర గ్రంధరూపంలో రాలేదు.

జిల్లెళ్లమూడిలోనే వుండాలనే నాటి మీ తలంపుకు కారణం ?

నిత్యం అమ్మ వద్దనే ఉండాలనే స్థిర సంకల్పానికి కారణం ఒక సంఘటన ఉంది. అమ్మ స్వీయచరిత్రను చెప్పే సందర్భంలో కొన్ని వ్యక్తిగతమైన విషయాలు, సంఘటనలకి నేను సాక్షిని. అవి నన్ను బాధించాయి. కావున వాటిని ప్రతిఘటించాలనిపించింది. అందుకు అహర్నిశలు ఒక వ్యక్తి అమ్మను అంటిపెట్టుకుని ఉండాలి. కనుకనే అమ్మతో అన్నాను ‘అమ్మా! నీ దగ్గర ఎవరైనా అహోరాత్రములు ఉంటే ఈ సంఘటనలను నివారించవచ్చు’ అన్నాను. “నాన్నా! ఎవరి ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, జీవితాలు మానుకుని వచ్చి నా దగ్గర అహర్నిశలు ఉంటారు?” అన్నది అమ్మ. ఈ సంభాషణ రాత్రిపూట జరుగుతున్నది. అమ్మ తన మంచంపై పడుకున్నది. నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ‘నేనుంటానమ్మా’ అన్నాను. అమ్మ రామకృష్ణ పడుకుని ఉన్నాడు. “మరి వాడో!” అన్నది అమ్మ. ‘వాడూ ఉంటాడు’ అన్నాను. అయితే చేతిలో చేయి వేయండి” అన్నది. అమ్మ చేతిలో నేను చేయి వేశాను. దానిమీద రామకృష్ణ చేతిని కూడా తీసుకొని వేశాను. నాకు బాపట్లలో Book shop కనుక రోజూ రాత్రిళ్ళు వస్తూండేవాడిని. రామకృష్ణ అప్పికటకరణం; వాడు పగలు వచ్చి అమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. నేను రాత్రిళ్ళు తెల్లవార్లూ అమ్మను కనిపెట్టుకొని ఉండేవాడిని. అప్పటికింకా కరెంటు రాలేదు. ఒక చేత్తో విసనకర్రతో విసురుతూ, రెండవ చేత్తో అమ్మ రాస్తూండేవాడిని. ఏ పని ఆగిపోయినా అమ్మ నిద్ర నుంచి లేస్తూండేది. ఆ విధంగా అమ్మ సేవలో పాల్గొనే అవకాశం, అదృష్టం అమ్మ నాకనుగ్రహించింది.

అమ్మ పై మీకు విశ్వాసం కలగటానికి గల కారణాలేంటి?

నాకు విశ్వాసం కలగటానికి ఒక అనుభవం ఉంది. 1963లో ఒకామె అమ్మకు పూజ చేస్తోంది. అమ్మ హాలులో దర్శనం ఇస్తోంది. లోపల ఖాళీ లేదు.. హాలు నిండా జనం. నేను ఎట్లాగో లోపలకు వెళ్ళి అమ్మకి ఎదురుగా గోడ ప్రక్కన చోటు చేసుకు కూర్చున్నా. అమ్మను తదేకంగా చూస్తున్నా. దేవతలు అనిమేషులు; రెప్పపాటులేకుండా పరమాత్మని చూస్తూంటారు. అలానే అమ్మ నుదుట ఉన్న కుంకుమ బొట్టుపై నా దృష్టి కేంద్రీకరించాను. క్రమంగా అమ్మరూపం వికసించటం ప్రారంభించింది. ఇంతితై అన్నట్టుగా చివరకు విశ్వంలో కలిసిపోయింది. నాకంటికి కనిపించనంత దూరం చూస్తున్నాను తర్వాత ఏం జరిగిందో తెలియదు. అలా వికసించి విశ్వవ్యాప్తమైన అమ్మరూపం సంకోచించి మరల పరిమితరూపంలోకి వచ్చింది. ఈ క్రమంలో నేను శూన్యంలోకి పోతున్నట్లు తెలిసింది..

ఆ తర్వాత తెలిసింది. నాడు అమ్మకు పూజ చేసుకున్న ఆమె దేవీ ఉపాసకురాలట. కాగా నాకు కలిగిన ఈ అనుభవం ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో బాగా పెరిగింది. నేను వెళ్ళి అమ్మ ఒడిలో తలపెట్టి అటు ఇటూ తిప్పుతున్నాను. అమ్మ నా తలమీద చెయ్యి పెట్టి “ఏమిటి, నాన్నా! మహదానందంగా ఉన్నావు?” అని అడిగింది. ‘అమ్మా! నాకు కలిగిన ఈ అనుభవానికి ఆధ్యాత్మిక నేపధ్యం ఉన్నదా?’ అన్నాను. “ఏముంది, నాన్నా పరిమితంగా ఉన్న అమ్మను నువ్వు అపరిమితంగా చూశావు. విశ్వరూప సందర్శనం అంటే అదే” అన్నది. “శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ఆ భాగ్యాన్ని ప్రసాదించాడు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. మరి నువ్వు నాకు అలా అనుగ్రహించటానికి కారణం ఏమిటి?’ అన్నాను. “నేను నీకు ఇద్దామనుకున్నాను, ఇచ్చాను. అంతే. అకారణమే కారణం” అన్నది.

మరొక ఉదాహరణ. నేను సంస్థాగతమైన పనులమీద ఎక్కువగా హైదరాబాద్ వెడుతూండేవాడిని. ఎవరైనా జిల్లెళ్ళమూడి నుంచి వచ్చారంటే అమ్మ వచ్చినట్లుగా ఆదరించేవాళ్ళు ఆరోజుల్లో అంతగా ఆనందపడేవాళ్ళు. అక్కడినుంచి తిరిగి వస్తున్నప్పుడు నన్ను సాగనంపటానికి 15/20 మంది సోదరులు బస్టాండ్కు వచ్చారు. నేను బస్సు ఎక్కాను, బయలుదేరింది. ‘అన్నయ్యా! అమ్మకి మా నమస్కారాలు చెప్పు, మా నమస్కారాలు చెప్పు – అన్నారు అంతా. మర్నాడు నేను జిల్లెళ్ళమూడి వచ్చాను. ‘అమ్మా! నీకు వెంకటరత్నంగారు, వెంకటకృష్ణగారు, T.S. శాస్త్రిగారు, రాధ….. నమస్కారాలు చెప్పమన్నారు’ అన్నాను. పేరు పేరున అందరి నమస్కారాలు అమ్మకి విన్నవించాను. “నాన్నా! అవన్నీ ఎప్పుడో చేరినాయ్. నువ్వే ఆలశ్యంగా వచ్చావురా!” అన్నది అమ్మ. నాకు చాల ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

మరొకసారి హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రాత్రి 12 గంటలైంది. విజయవాడ వెళ్ళే టాక్సీలో ముందు సీట్లో కూర్చున్నాను. హైదరాబాద్ పొలిమేర దాటిన తర్వాత మా టాక్సీకి యాక్సిడెంట్ అయింది. వడ్లబస్తాలు వేసుకుని మా ముందు 20/30 ఎడ్లబళ్ళు పోతున్నాయి. హారన్ వేశాడు డ్రైవర్. కానీ ఆ బండివాడు తప్పుకోలేదు. మా టాక్సీ ఆ బండిని ఢీకొట్టింది. హాహా కారాలు తాళ్ళు త్రెంపుకుని ఎడ్లుపరుగెత్తినయ్. బస్తాలు తెగి వడ్లు రోడ్డుమీద గుట్టలుగా పడ్డాయి. అది చూసి బండ్లవాళ్ళు అంతా ఆవేశంతో ‘వసికర్రలు’ (బండిపై వస్తువులు కదలకుండా అమర్చే కర్రలు) తీసికొని మమ్మల్ని కొట్టటానికి వచ్చారు. మా టాక్సీ నుగ్గునుగ్గు అయింది. అందులో తక్కినవాళ్ళు ఏమైనారో తెలీదు. యాక్సిడెంట్ అయిన సమయంలోనే కాళ్ళు నెప్పి అనిపించి ‘అమ్మా!’ అంటూ పైకెత్తాను. అమ్మ అలా రక్షించింది. లేకుంటే నా రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యేవి. కిటికీ అద్దాలు పగులగొట్టి నన్ను బయటికి లాగారు. బండి వాళ్ళంతా చుట్టుముట్టి నన్నుకొట్టబోయారు. ఈ లోగా రోడ్డుమీద అటూ ఇటూ కార్లు, లారీలు స్తంభించిపోయాయి. వాటి డ్రైవర్లంతా వచ్చారు. ‘టాక్సీ వాడి తప్పేమీలేదు. హారన్ కొడుతూనే ఉన్నాడు. బండివాడే తప్పుకోలేదు. వాడిదే తప్పు’ అన్నారంతా. దాంతో బండివాళ్ళు డ్రైవర్లు తన్నుకోవటం మొదలుపెట్టారు.

ఈ హడావిడిలో ఎవరో ఒక డ్రైవరు వచ్చి నన్ను జబ్బపట్టుకొని అమాంతం బరబర ఈడ్చుకుంటూ ముందున్న ఒక లారీలో ఎక్కించి అక్కడ నుంచి నన్ను తీసికెళ్ళమన్నాడు. ఆ డ్రైవర్ నన్ను సూర్యాపేట రోడ్డుప్రక్కన పోస్టాఫీసు దగ్గర బెంచీ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. నా మోకాలుకి తలకీ దెబ్బలు తగిలాయి. ఒళ్ళంతా కారి ఎండిన నెత్తురు మరకల్ని తుడుచుకున్నాను. గాయాల్ని అలాగే అదిమిపట్టి మరొక లారీ ఎక్కి విజయవాడ వచ్చి క్రమేణా జిల్లెళ్ళమూడికి చేరుకున్నాను. ఏడవమైలు వద్ద దిగి అలాగే నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుగుకొని అమ్మ గది సమీపానికి చేరుకున్నాను. ఈ లోగా లోపలి గదిలో నుంచి రెండు చేతులూ చాచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మ “నాన్నా! నువ్వు బ్రతికి వచ్చావా?” అని నన్ను అమాంతం వాటేసుకుని తనగది లోపలికి తీసికెళ్ళింది. ప్రక్కనున్న వాళ్ళంతా అమ్మను ‘బ్రతికివచ్చావా అని అడిగావేమిటి?” అని అడిగారు. “వాడినే అడగండి” అన్నది అమ్మ. అపుడు నేను యాక్సిడెంటు వివరాలు చెప్పాను. ఎప్పుడైతే అమ్మ నాకు ఎదురు వచ్చి “నాన్నా! బ్రతికివచ్చావా?” అన్నదో వెంటనే నాకు అర్థమైంది ఎక్కడో హైదరాబాద్ దగ్గరలో జరిగే ప్రమాద సంఘటనని అమ్మ ఇక్కడ నుంచి చూసి, నాకు ప్రాణదానం చేసింది- అని. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఈ అమ్మ నిరంతరం నన్ను వెన్నంటే వుంది.

ఈ అమ్మే - మీ అమ్మ అనుకొన్న సందర్భం ఎలాంటిది?

1960 నుంచి 1968 వరకు అమ్మ పూరింట్లో ఉండేది. నా అనుభవాలన్నీ దాదాపు అక్కడ జరిగినవే. శేషగిరిరావు అన్నయ్య ఆ ఇంటిని కట్టించాడు. అందులో అమ్మ స్నానం చేసే చిన్న గది ఉంది. అందులో ఒక నీటి తొట్టి ఉండేది. ఒకనాడు దానికి ఒకవైపు ‘అమ్మ’; రెండవవైపు నేనూ వున్నాము. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను కొంటెగా నాన్నగారిని ఒక మాట అన్నాను. అమ్మ ఆ తొట్టెలో ఉన్న చెంబు తీసికొని నామీదికి విసిరేసింది. అది నా తలకి తగలటంతో నెత్తురు కారసాగింది. వెంటనే అమ్మ తన చీరె చించి గట్టిగా కట్టు కట్టి, నన్ను పట్టుకుని ఏడవటం ప్రారంభించింది. ఆ సంఘటన నా బాల్యంలోని ఒక సంఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పుడు అమ్మ నేను ఓదార్చాల్సి వచ్చింది.

‘అమ్మా! ఇది నువ్వు నన్ను కొట్టడం కాదు. నువ్వు నా తల్లివని ఎరుకపరుస్తున్నావు’ అన్నాను. నా బాల్యంలోనే మా అమ్మ చనిపోయింది. ఆమె రూపం కూడా నాకు గుర్తులేదు. అప్పటి చేష్టలు గుర్తున్నాయి. ఒకరోజు నాకు తలంటిపోయాలని నన్ను పట్టుకోబోతే నేను చిక్కలేదు. మా గ్రామం ‘మునిపల్లె’. మా ఇంటికెదురుగా ఒక బావి ఉండేది. ఆ బావి చుట్టూ గిరగిరా | తిరగడం మొదలుపెట్టా. ఆమె తిరిగి తిరిగి విసిగిపోయి అక్కడున్న ఒక చెంబుని నా మీదికి విసిరేసింది. అది నాకు తగిలి నెత్తురుకారడం, ఆమె చీరెను చింపి నాకు కట్టుకట్టి నన్ను పట్టుకుని ఏడవటం – సరిగా మా ‘అమ్మలాగే’ – ఈ సంఘటన. కావున ఈ అమ్మ నా తల్లే అనిపించింది.

మీరెరిగిన అమ్మ విశ్వజనీనతత్వాన్ని తెలియపర్చండి?

ఒకనాడు వాత్సల్యాలయంలో అమ్మ దర్శనం ఇస్తోంది. ఒక సోదరుడు వచ్చాడు. ‘అమ్మా! నేను మిమ్మల్ని విజయవాడలో చూశా; మరలా ఇవాళ చూస్తున్నా’- అన్నాడు. “విజయవాడలో ఎక్కడ చూశావు నాన్నా!” అన్నది. “మీరు విజయవాడ PWD గ్రౌండ్స్లో దర్శనం ఇస్తున్నారు. దాదాపు లక్షమంది వచ్చారు. అపుడు మిమ్మల్ని చూశాను’ అన్నాడు. “నిన్నూనేను చూశాను” అన్నది అమ్మ. ‘లక్షమంది జనంలో ఎక్కడో చివరలో ఉన్నాను. నన్ను చూడటమేమిటమ్మా!’ అన్నాడు. “నువ్వు ఎఱ్ఱచొక్కా తొడుక్కుని, నీ స్నేహితుని భుజాల మీద చేతులు వేసుకుని నన్ను చూస్తుండగా నేను నిన్ను చూశాను” అన్నది అమ్మ. ఆతడు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని ‘నిజమే – లక్షమందిలో నన్ను ఎలా గుర్తుపట్టారు?’ అని అడిగాడు. “నాన్నా! గొట్టెల కాపరికి వాడి గొట్టె జ్ఞాపకం ఉండదా? ఇదీ అంతే. తల్లి బిడ్డని గుర్తుపట్టలేదా?” అన్నది అమ్మ.

ఒకనాడు అమ్మ మంచం మీద కూర్చున్నది. మేమంతా మంచం చుట్టూ కూర్చొని ఉన్నాం. అడవులదీవి సో॥ మధు వారి పొలంలో పండిన వేరుసెనగ కాయలు తెచ్చి అమ్మకి నివేదన చేశారు. అమ్మ తన మంచం మీద ఒక వార్తాపత్రిక పరచి వాటిని దాని మీద పోసింది. వాటిని మంచం పట్టికి కొట్టి ఆ పప్పుల్ని చుట్టూ కూర్చున్న మా అందరికీ నోట్లో పెడుతూ, అప్పుడప్పుడు తాను తింటున్నది. కొంత సేపటికి ఆ వార్తాపత్రిక పైనున్న ఒక ఫోటోవైపు నిశితంగా చూసింది. ఆ చిత్రాన్ని చూస్తూ “నాన్నా! నువ్వు ఇక్కడున్నావా!” అని ఎంతో ప్రేమతో కాగితంలోని ఫోటోకి వేరుసెనగ పప్పు నోటికి అందించింది. మా అందరికీ ఎంత వాత్సల్యంతో పెట్టిందో అలాగే ఆ ఫోటో నోటిదగ్గర పెట్టింది. తీరా చూస్తే ఆ ఫోటో ‘భగవాన్ శ్రీ రమణమహర్షులవారిది’. అంటే రమణమహర్షులను కూడా తన బిడ్డగా భావించింది ‘అమ్మ’. ఆ సన్నివేశం నా మనస్సు మీద గాఢమైన ముద్రవేసింది.

ఆశ్చర్యకర వాత్సల్యం: ఆ రోజుల్లో జిల్లెళ్ళమూడి గ్రామంలో పార్టీలుండేవి. పార్టీలతో ద్వేషాలు, కక్షలు సహజమే. అమ్మ పూరింట్లో ఉండేది. నాన్నగారు గ్రామాంతరము వెళ్ళినపుడు రెడ్డి సుబ్బయ్యని ఇంటికి కాపలా ఉంచేవారు. అమ్మ ఆరుబయట మంచం మీద పడుకున్నది. రెడ్డిసుబ్బయ్య మంచం ప్రక్కన నేలమీద పడుకున్నాడు. నిశిరాత్రి గం 12.00ల ప్రాంతంలో నాన్నగారి వ్యతిరేక పార్టీలోని ఒకడు వచ్చి అమ్మపై అత్యాచార యత్నం చేశాడు. నేరుగా వచ్చి మంచం మీద ఉన్న అమ్మమీద పడ్డాడు. అమ్మ వాణ్ని చూసింది. కాలు నెమ్మదిగా పైకి మడిచి వాడి పొట్టలో కాలు పెట్టి ఒక్క తన్ను తన్నింది. ‘అమ్మోయ్!!’ అని కేకవేసి వాడు వెళ్ళి అంతదూరంలో పడ్డాడు. నిద్రపోతున్న రెడ్డిసుబ్బయ్యను అమ్మ తట్టిలేపింది. “చూడు. ఎట్లా జరిగిందో!” అన్నది. సుబ్బయ్య వాడిని చూశాడు; కర్ర తీసికొని వెంటపడ్డాడు. వచ్చినవాడు చీకట్లో పారిపోయాడు.

ఆ విషయం నాకు అమ్మ ఒకనాడు వివరించింది. అమ్మ ఇంట్లో వంట ఇల్లు చిన్నది. ఆ గదిలో చిన్న కిటికీ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ కిటికీ ప్రక్కన అమ్మ కూర్చుని అన్నం కలిపి నాకు ముద్దులు పెడుతోంది. ఆ కిటికీ వంక చూసింది. “నాన్నా! ఆ బజారున అటుపోతున్నాడే వాడిని చూడరా ” అన్నది. నేను కిటికీలోంచి చూసి ‘ఆ’ అన్నాను. “మొన్న నీకు ఒక సంఘటన చెప్పాను చూడు. అది వాడేరా” అన్నది. వెంటనే నేను కోపోద్రేకంలో అప్రయత్నంగా ‘ఓరి లంజకొడకా!’ అన్నాను. వెంటనే అమ్మ “మరి నువ్వో!” అన్నది. అమ్మ బిడ్డగా నాకు గోరుముద్దలు తినిపిస్తూ నాతో “మరి నీవో!” అనేటప్పటికి నా కళ్ళు తిరిగినంతపనైంది. ‘అమ్మ’ తనను చెరచడానికి వచ్చిన దుర్మార్గుని కూడా తన బిడ్డగా భావన చేయటం మన ఊహలకందని అద్భుతం అనిపించింది.

అమ్మ చలన చిత్ర నిర్మాణ పరిణామక్రమం వివరించండి?

1971లో అమ్మ జన్మదినోత్సవాల్ని నిర్వహించుకోబోతున్నాం. జిల్లెళ్ళమూడిలో అన్ని ఉత్సవాల్నీ, పండగల్నీ, 8m.m లోనో, 16 mmలోనో Cover చేస్తూండేవాళ్ళం. అట్లాగే ఆ ఏడాదీ చేద్దాం అనుకున్నాం. పని మీద నేను మద్రాసు వెళ్ళాను. శ్రీచుండూరి సీతారామయ్య (ఇంజనీర్ తాతయ్య) గారింట్లో దిగాను. వాళ్ళబ్బాయి అచ్యుత్ అక్కడ ప్రముఖ Architect. ‘ఈసారి 35 mmలో అమ్మ జన్మదినోత్సవం Cover చేస్తే ఎట్లా ఉంటుంది?” అన్నారు. తాతగారు. ‘చేస్తే దానిని సినిమాహాలులో ప్రదర్శించాలి. చాలా ఖర్చు అవుతుందేమో!’ అన్నాను. ‘మా కోడలు అన్నయ్య చంద్రమోహన్ Cine Camera man. ఆతన్ని కనుక్కుందాం’ అన్నారు. రెండు రీళ్ళడాక్యుమెంటరీగా ఒకరోజు సన్నివేశాన్ని Cover చేయడానికి రు. 15,000 లు అవుతుందని వివరించాడు చంద్రమోహన్. తాతగారు ‘ఆ 15 వేలు నేను ఇస్తాను’ అన్నారు. నేను జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతో మిగతా వాళ్ళతో చెప్పాను. అంతా సంతోషించారు. సుమారు 6 కాపీలు తీశాం. తదుపరి ‘feature film తీయటమా, documentary తీయటమా?’ అనే సమస్య వచ్చింది. అమ్మని liveగా ఉంచాలి. actorగా కాదు. తరతరాల వాళ్ళకి అమ్మని చూపించాలంటే ఇది ఒకటే మార్గం. ఒక సంవత్సర కాలంలోని పండుగలు, ఉత్సవాలు, పూజలు అన్నీ Cover చేద్దాం- అని నిర్ణయించాం. 8 కాపీలు తీసి 8 Theatre లకి ఇచ్చి విడుదల చేశాం. కానీ Distributors సరియైన advertisement లేకుండా release చేసినందున, ప్రదర్శన లోపాల వలన ఆర్థికంగా, film flop అయింది. తర్వాత ఆ సినిమాను ఆయా ధియేటర్లలో వేసి సంస్థకి విరాళాలు సేకరించడానికి ఉపయోగించుకున్నాం. Film ని English లో కనుక తీసేట్టయితే విదేశాలకి కూడా పంపడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో 15 రీళ్ళ సినిమా negativeని 7 రీళ్ళకు cut చేశాం. అలా English version లో కూడా ఒక Pictureని produce చేశాం. దానికి Script ఇంగ్లీషులో M. Dinakar వ్రాశారు. London సోదరులు James campion ఇంగ్లీషులో Voice ఇచ్చారు. కానీ కొన్ని కారణాలు వలన ఆ picture వెలుగులోకి రాలేదు. తర్వాత మేము ఆ Picture ని Preserve చేసిన Office మద్రాసు నుంచి బొంబాయి తరలించారు; వాళ్ళ వద్దా negative కనబడలేదు. తెలుగులో 15 రీళ్ళ సినిమాను, 2 రీళ్ళ డాక్యుమెంటరీని తమిళంలో Produce చేశాం; తమిళనాడులో కూడా ప్రదర్శించాం.

అమ్మ స్వర్ణోత్సవ నేపథ్యం తెల్పండి?

స్వర్ణోత్సవాల్లో అమ్మ లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టింది. జిల్లెళ్ళమూడి గ్రామ జనాభా 1000 మంది. భోజనం పెడతాం అన్నా లక్షమంది. వస్తారా అనే అనుమానం అందరికీ, అమ్మ చెప్పింది కాబట్టి ఎవరూ మాట్లాడటానికి వీలులేదు. ‘జరుగుతుందేమో అనే ఆశ. రామకృష్ణ, అన్నంరాజు శ్రీరామకృష్ణారావుగారు, DSP సత్యనారాయణగారు, నేను మేమంతా విరాళాలు సేకరణకి బయలుదేరాం. సంస్థలో ఆర్థిక నిల్వఏమీలేదు- ఏరోజు కారోజు. వెతుక్కుండే పరిస్థితే. ఆ సమయంలో రామకృష్ణకి, నాకూ అమ్మ గుడ్డలు పెట్టింది. రామకృష్ణ తీసుకున్నాడు. నేను ఉత్తరీయాన్ని తీసి అమ్మ మంచం మీద పెట్టా. “ఏమిటీ? ఇక్కడ పెట్టావు?” అన్నది. ‘ఉత్తరీయం వేసుకునే అలవాటు లేదమ్మా నాకు, నాకెందుకు? ఇంకెవరికన్నా పెట్టవచ్చు అని’ అన్నాను.

“నీకు ఈ ఉత్తరీయం ఇవ్వటంలో ఉద్దేశం – నువ్వు ఈ వేసుకుని కులుకుతూ తిరగమని కాదు. నువ్వు ఒక పనిమీద బయటికి పోతున్నావు. నువ్వు ఒడి పట్టడానికి వెడుతున్నావు. వేసేవాళ్ళు ఏం వేస్తారో ! 1116లు ఇస్తారో, 10 వేలు ఇస్తారో, 1 రూపాయి ఇస్తారో, చద్ది అన్నం పెడతారో, గుప్పెడు బియ్యమే పెడతారో – వాళ్ళు ఏం పెట్టినా నువ్వు ఒడిపట్టాలి. వేసుకో” అన్నది. అది నాకు మహత్తర సందేశం. తర్వాత మా అనుభవాల్లో అలాంటివి అనేకం జరిగినయ్. ముందుగానే అమ్మ మాకు శిక్షణ ఇచ్చింది కాబట్టి మేము బాధపడలేదు.

గుంటూరు జిల్లా కలెక్టర్ జయభారతరెడ్డి గారిని కలిశాం. ‘లక్షమంది ఒకే పంక్తిలో భోజనం చెయ్యడం అంటే నాకు అర్థం కావటం లేదు. మీకు ఏం కావాలో చెప్పండి. అది చేస్తాం’- అన్నారు. ఇంజనీర్ తాతగారి Planning ప్రకారం-60 ఎకరాల పొలంలో ఆకులు వేసి భోజనం పెట్టడానికి అనువుగా పొలాన్ని చదును చేసి షామియానాలు, తాటాకు పందిళ్ళు వేశారు. 13 వంటశాలలు. ఆంధ్రప్రదేశ్ Supplies departments అన్నిటి నుంచీ వంట సామాగ్రి తెచ్చాం. లక్షమంది భోజనాలు చేస్తుంటే అమ్మ జీపులో వెళ్ళి పంక్తుల మధ్యలో సాగిపోతూ ఆ దృశ్యాన్ని చూసి ఆనంద పరవశురాలైంది. లక్షా 50 వేల మంది వచ్చారు.

డోలోత్సవాన్ని కూడా అమ్మ చేయాలన్నారని విన్నాము. అవి చేశారా?

“లక్షమంది పసిపాపల్ని ఉయ్యాలల్లో పడుకోబెట్టి వాళ్ళ వాళ్ళ తల్లులు ఆ పిల్లల్ని ఊపుతూండగా వాళ్ళను చూడాలి” అనే గొప్ప కోరిక కోరింది. అమ్మ. దీనినే డోలోత్సవం అని పిలుస్తాం. లక్షమంది పసివాళ్ళకి ఊయ్యాలలు వేయాలంటే 120 ఎకరాల పొలం కావాలి. అది సాధ్యం కాదనిపించింది. మాకు. లక్షమంది పిల్లలకి పాలు, తల్లులకు భోజనాలు, ఉయ్యాలలకు లక్షచీరెలు… ఆచరణ సాధ్యం కాదనిపించింది.

కానీ అమ్మ ఆనాడు చెప్పింది కదా అని ఇటీవల కాలంలో అన్నపూర్ణాలయం షెడ్లో 108 మంది పిల్లలకి ఉయ్యాలలు ఏర్పాటు చేశాం. 136 మంది తల్లులు వారి పిల్లలతో వచ్చారు. పిల్లలను చూసి తల్లులు, తల్లుల్ని చూసి పిల్లలు, ఆ దృశ్యాన్ని చూసి సర్వాంతర్యామి అయిన “అమ్మ”, అది చూసి మేము ఎంతో ఆనందించాము. ఆనాటి డోలోత్సవ నిర్వహణలో కీ.శే. తంగిరాల కేశవశర్మ ప్రముఖపాత్ర వహించారు.

సకల జీవరాశిపై అమ్మ మాతృప్రేమను వెల్లడించే సన్నివేశాలు ఏవైనా చెప్పండి?

మనుష్యులనే కాదు. క్రిమికీటకాదుల్ని, పశుపక్ష్యాదుల్నీ అమ్మ సంతానంగా ప్రేమిస్తోంది. లక్షా ఏభైవేల మంది భోజనాలు చేయగా ఇంకా ఆహార పదార్థాలు మిగిలినాయి. వాటిని తీసుకువెళ్ళి పొలాల్లో నీళ్ళల్లో చెరువుల్లో వెదజల్లమన్నది. “ఈ ప్రసాదం, పండుగ వాటికి కూడా” అన్నది. అలాగే చేశాము. అమ్మ వద్దకు పక్షులు, కాకులు వస్తూండేవి. అమ్మ చేటలో బియ్యం వేసుకుని వెదజల్లేది. గాలిలోనే ఉన్న ఆ గింజలు క్రిందపడకుండానే పక్షులు ఎగిరి పట్టుకుని తినేవి. కుక్కలూ, కోతులూ వచ్చేవి. అమ్మ ప్రేమతో వాటికీ ఆహారాన్ని అందించేది; అలా అవీ ఆనందించేవి. ఆ దృశ్యం మనోహరం అద్భుతం.

అందరింటి పై నక్సలైట్ల దాడి ఎలా జరిగింది?

అమ్మ సంస్థ మీద దాడి జరిగిన భయానక దృశ్యం. 1975 సంవత్సరము, డిసెంబర్ 30, రాత్రి గం. 12.00 సమయం. ఎక్కడి నుంచో కొందరు వచ్చి ‘నక్సలిజం జిందాబాద్, నక్సలైట్స్ జిందాబాద్: అమ్మలూ – బాబాలూ నశించాలి’ అంటూ slogans ఇచ్చుకుంటూ అందరింటి ఆవరణలోకి ప్రవేశించారు. అప్పటివరకు ఎవరో అమ్మకు ‘అనసూయావ్రతం’ చేసుకున్నారు. అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో అమ్మ గది ముందు నేనూ, పి.యస్.ఆర్. ఉన్నాం. ఏదో attack జరిగేట్టుగా ఉంది – అనిపించింది. వాళ్ళు అమ్మ ఉన్న ఇంటిమీద attack చేశారు. వస్తూనే గొడ్డళ్ళతో తలుపుల్ని ధనాధనా బ్రద్దలు కొట్టడం మొదలు పెట్టారు. నేను, పి.యస్.ఆర్. భుజాలు ఆనించి అవి బ్రద్దలు కాకుండా ఉండటానికి పెనుగులాడాం. కానీ బ్రద్దలు కొట్టేశారు. ‘అన్నయ్యా! ఇక మనం వాళ్ళని ఆపలేము. మనం వెళ్ళిపోదాం’ అన్నాడు పి.యస్.ఆర్. ‘నువ్వు వెళ్ళిపో. నేను ఇక్కడనే ఉంటాను’ అన్నాను. వెంటనే వెనుక తలుపుతీసి తను వెళ్ళిపోయాడు. నేను మాత్రమే ఉన్నా ఆ గదిలో. వాళ్ళు లోపలికి ప్రవేశించారు. ’15 ని.ల నుంచీ మేము బద్దలు కొడుతున్నా; నువ్వు లోపల ఉండే తలుపు తీయకుండా ఉంటావా?’ అంటూ నన్ను అమాంతం కాలర్ పట్టుకుని బరబరా ఈడ్చుకొని వరండాలోకి తీసుకొచ్చారు. అప్పటికే ఆవరణంతా బాంబులు వేస్తున్నారు. ఐదారుగురు బాంబులు వేసుకుంటూ తిరుగుతున్నారు. దాంతో ఆవరణంతా బాగా పొగ కమ్మింది. ఊళ్ళోవాళ్ళకీ- ఇక్కడి వాళ్ళకీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియటం లేదు. ‘ఎవరూ మమ్మల్ని పట్టుకోవటానికి కాని లోపలికి రావటానికి కాని ప్రయత్నం చెయ్యొద్దు. మేము మిమ్మల్ని ఏమీ చెయ్యం. మీరు కనుక లోపలికి రావడానికి ప్రయత్నిస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాం. మేము పనిమీద వచ్చాము. ఆ పని పూర్తి చేసుకుని వెడతాం’ అని వాళ్ళు అందరినీ హెచ్చరిస్తున్నారు.

వాళ్లు నా చుట్టూ నిలబడి గొడ్డళ్ళూ, గునపాలూ, బరిసెలూ ఎత్తి ‘వెయ్యి పోట్లు పొడవాలి” అని కేకలేశారు. వాళ్ళు సుమారు 20 మంది వచ్చారు. 12 మంది ఈ operationలో ఉన్నారు లోపల. వెంటనే నేను అనుకున్నాను ‘అయిపోయింది నాపని; పొడిచేశారు’ అని. వాళ్ళు చంపేపోతారు; అందుకు సిద్ధమయ్యే ఉన్నాను. వాళ్ళంతా ఒక్కసారి బరిసెలు ఎత్తారు. ‘అమ్మా!’ అని ఒక్కకేక పెట్టాను. చెయ్యి పైకి ఎత్తాను. బరిసెకి అడ్డంగా నా అరచేయి ఉంది. ‘మీ అమ్మా, గిమ్మా నిన్ను రక్షించేవారెవరూ లేరు. నువ్వు నా చేతిలో చస్తున్నావురా’ అంటూ ఒక్కడే ఆ బరిసె వేశాడు. నా వేలుకి ఉంగరం ఉంది. అది ఆ ఉంగరాన్ని చీల్చుకుంటూ అరచేతిని చీల్చుకుంటూ నా చొక్కా చీల్చుకుంటూ నేలని తాకింది. ఆ ఉంగర ప్రభావం అంతటిది. వెంటనే ‘ఒరేయ్ ! ఆ ఉంగరం ఇచ్చేయ్యరా’ అన్నాడు. వాడి మనస్సు ఆ ఉంగరం మీదికి పోయింది. ఈ చేత్తో ఉంగరం తీయబోతే, గడియారం కనిపించింది. ‘ఆ గడియారం కూడా ”ఇచ్చెయ్యరా’ అన్నాడు. రెండూ తీసి ఇచ్చాను. ఇంతలో ఒకడు అందరింటి ముందు రోడ్డుపై నుండి ’15 minutes over, 20 minutes over’ అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు. వాళ్ళు నన్ను మళ్ళీ బరబరామని లోపలికి ఈడ్చుకొచ్చారు. బీరువా తాళం చెవులు ఇమ్మన్నారు. అవి నా దగ్గరలేవన్నాను. మళ్ళీ ‘పొడవండి’ అన్నారు. బరిసెలు ఎత్తారు. అందులో ఒకడు ‘వాడిని పొడిచే దేముంది ? బీరువా ఎదురుగా ఉన్నది కదా! దానిని బద్దలు కొట్టండి’ అన్నాడు. బీరువాను పగులగొట్టి లాకర్లో ఉన్న, పూజాసామాగ్రి, బంగారం, వెండి తీసి రెండు సంచుల నిండా వేసుకున్నారు. ఇంతలో 25 minutes over caution మళ్ళీ వినిపించింది. వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి నేనే సాక్షి కదా! వీళ్ళు సంచులు జాగ్రత్త పెట్టుకుని వచ్చి నన్ను చంపేపోతారు అని నేను ఆ గదిలోనే కూర్చున్నాను – నేను లేచిపోతే అమ్మ గది మీద దాడి చేస్తారేమోనని.. కానీ వాళ్ళు ‘one – two – three – March’ అంటూ వెళ్ళిపోయారు.

నేను గదినుంచి బయటికి వచ్చా. ఆవరణ అంతా నిర్మానుష్యంగా ఉంది. మేడ మీది వాళ్ళు క్రిందికి దిగిరాకుండా తలుపుల్నీ బయట గడియలు వేశారు. వాళ్ళు. నాన్నగారు వాళ్ళంతా మేడ పైనున్నారు. క్రింద ఏం జరుగుతోందో వాళ్ళకి తెలియదు. అమ్మ ఎక్కడ ఉందో ఏమిటో అని వరండాలోంచి చూస్తున్నా. ఇంతలో ఒక తలుపు తెరచుకుంది. డాక్టర్ సత్యం వచ్చాడు. నన్ను అమ్మదగ్గరికి తీసికెళ్ళాడు. నన్ను చూసి అమ్మ అంది “నాన్నా! నువ్వు వేసిన కేక నాకు వినబడ్డదిరా. నేను వద్దామనుకున్నాను. కానీ ఈ ఆడవాళ్ళంతా నా రెండు కాళ్ళూ పట్టుకుని వదల లేదు నాన్నా” అన్నది. నేనన్నాను ‘అమ్మా! నువ్వు రాకపోతే నేమి? నేను రక్షించబడ్డాను కదా! చూస్తుండగానే దొరికినంత దోచుకుపోయారు. నేనేం చేయలేకపోయాను’ అన్నా బాధగా. “పోతే పోయింది. నువ్వు వున్నావు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది నాన్నా! బిడ్డపోతే తేగలమా?” అన్నది అమ్మ.

సంస్థ 'Logo' రూపకల్పనకి మీ ప్రేరణ ఎలాంటిది?

అమ్మ తత్త్వం “నేను నేనైన నేను”. దీనిని వివరించమని అమ్మను అడిగా. “ప్రతివాడూ ‘నేను ఫలానా’ అని చెప్తాడు. ఆ ‘నేను’ అందరిలో ఉన్నటువంటి నేనైన ‘నేను’ – ఆ ‘నేను’ నేనే. అందరిలో ఉన్నటువంటి ‘నేను’ ఏదైతే ఉన్నదో ఆ ‘నేను’ ‘నేనే’ అన్నది అమ్మ.

అమ్మ నాకు విశ్వరూపసందర్శన భాగ్యాన్ని ప్రసాదించిన సందర్భంగా ఒక crestను రూపొందించాను. ఒక చెరువులో ఒక రాయి వేశామనుకోండి; వరుసగా తరంగాలు విస్తరిస్తాయి. ఆ చెరువుకి కట్టలు ఉన్నాయి కాబట్టి అంతటితో ఆగిపోతాయి. లేకుంటే ఎంతవరకు నీరు ఉంటే అంతవరకూ అనంతంగా సాగిపోతూనే ఉంటాయి ఆ తరంగాలు. అమ్మ విశ్వవ్యాప్తమైనది. ఆ భావాన్ని సంస్థకి crestగా పెట్టాలనిపించింది. మద్రాసులో ఒక artist చేత ఒక logo వేయించాను. దాని చుట్టూ వృత్తములు వస్తాయి. దీని significance ఏమిటంటే – పైన ‘నేను నేనైన నేను’ అని పెట్టాము. ‘మాతృశ్రీ’ అని క్రింద పెట్టాము. అటూ ఇటూ నక్షత్రాలు, సర్పాలు ఏర్పరచాము. ఆ తర్వాత సంస్థకి ఒక జెండాను కూడా రూపొందించారు; దాంట్లో ఇదే Logoను పెట్టారు. అమ్మ మాసపత్రిక ‘విశ్వజనని’ మీద కూడా అదే symbol ఉంటుంది. సర్వం తానైన ||బ్రహ్మస్వరూపిణిగ అమ్మ నాకు దర్శనం ఇచ్చింది.

“నీ బిడ్డలో నువ్వు ఏం చూస్తావో దానిని అందరిలో చూడగలిగితే అదే బ్రహ్మస్థితి” అన్నది. ఆత్మావైపుత్రనామాసి. మన సంతానంలో మనల్నే చూసుకుంటాం. అందరిలో దానినే చూడమన్నది అమ్మ. అదే బ్రహ్మస్థితి. కేవలం చెప్పటమే కాకుండా తాను ఆచరించింది.

“మీరు కానిది నేనేదీ కాదు” అన్నది. ‘నీ ఆరాధ్యమూర్తులు ఎవరమ్మా?’ అంటే “మీరే” అన్నది. అమ్మకు సర్వం బ్రహ్మ. సర్వాన్నీ ఆత్మస్వరూపంగా చూస్తుంది. అమ్మ యొక్క బ్రహ్మస్థితిని నేను కళ్ళారా చూశాను.

మీరు ఎప్పుడూ అమ్మ సేవలో సంస్థ పనిలో తలమునకలై ఉండేవారు. ఇది కుటుంబ బాధ్యతల నిర్వహణకు ఆటంకం కాలేదా?

నా 30వ ఏట నుంచి ఇక్కడ అమ్మ సేవలో ఉంటున్నాను. ఒకనాడు అమ్మ అన్నది “నువ్వు నిరంతరం నా సేవలో ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను” – అని ఒక హామీ ఇచ్చింది. ఆ హామీయే నన్ను నా కుటుంబాన్ని ఇప్పటికీ కాపాడుతోంది.

నాకు ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళంతా అమ్మ దయవలన వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు, సంసారాలు సుఖంగా చేసుకుంటున్నారు; స్వయంగా హాయిగా తృప్తిగా జీవిస్తున్నారు. ఇదంతా అమ్మ కరుణే. ఇదే అనేక సందర్భాల్లో అమ్మ నన్ను ఆదుకోవటం ద్వారా ఋజువైంది.

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!