Sri Sri Sri Siddheswarananda Bharati Swami

Interviewed by
Dr Pothuri Venkateswara Rao
08/12/2011
Courtallam

 

శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి – (కుర్తాళ పీఠాధిపతులు)

 

వీరు 23.1.1937వ తేదీన జన్మించారు. స్వగ్రామం సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామం. తండ్రి శ్రీ పోతరాజు పురుషోత్తమరావు, తల్లి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి. భార్య శ్రీమతి దుర్గాత్రిపుర సుందరీదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె గలరు. తోబుట్టువులు – నలుగురు సోదరులు, ఒక సోదరి. విద్య M.A.Ph.D. వృత్తి – Retd. Principal, Hindu – College, Guntur. ప్రస్తుతం కుర్తాళం, సిద్ధేశ్వరీ పీఠాధిపతులు. ఆశ్రమనామం పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి.

ప్రవృత్తి : అవధాని కులావతంసునిగ, ఆశుకవి చక్రవర్తిగా, సాహిత్యరూపక సమ్రాట్ దేశవిదేశాల్లో విఖ్యాతి పొందారు. కఠోర తపస్సు చేసి లలిత, కాళీ, కాలభైరవ, బృందావనేశ్వరి రాధాదేవి వంటి ఎందరో దేవతలను ప్రసన్నము ప్రత్యక్షము చేసుకున్నారు. అంతర్నేత్రంతో భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగిన మహామహిమాన్విత యోగులు.

జగద్గురువులుగా, పరమహంసలుగా, పరివ్రాజకాచార్యులుగా ఎందరికో సన్యాసదీక్షను ప్రసాదించారు; స్త్రీలకు యోగినీదీక్ష నిచ్చారు.

జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి 1960 నాటికే ‘అంబికాసాహసి’ అనే వేయి పద్యాలు, శ్లోకాలు రచించారు. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన అనంతరకాలంలో అమ్మను ఆవాహనచేసి మాట్లాడిన మహిమాన్వితులు..

సెల్ నెం : 9490369800

ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారు 08-12-2011న కుర్తాళంలో శ్రీ స్వామివారితో చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

******


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

శ్రీ స్వామివారి మొదటి అమ్మ దర్శనాన్ని ప్రస్తావించగా....

మొదటిసారి కృష్ణభిక్షువుగారు, పొత్తూరి వేంకటేశ్వరరావుగారు, మిన్నికంటి గురునాధశర్మ గారు, నేను ఇంకా మరికొంతమంది కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాము. మాకంటే ముందు కృష్ణభిక్షువుగారు జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వారు రమణాశ్రమంలో చాలాకాలం ఉన్నారు; కంచి పరమాచార్య దగ్గర కొంతకాలం ఉన్నారు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని దగ్గర కొంతకాలం ఉన్నారు. వాళ్ళందరి సేవ చేశారు. ప్రధానంగా రమణాశ్రమంలో ఎక్కువ కాలం ఉండటం రమణుల యొక్క చరిత్ర తెలుగులో వ్రాసిన మొదటి వ్యక్తి ఆయన.

గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారు స్థాపించిన శారదానికేతన్ ఉండేది. దానికి ఆయన Executive Officer గా ఉద్యోగరీత్యా వచ్చారు. ముగ్గురు సిద్ధవ్యక్తులు రమణమహర్షి, కంచి పరమాచార్య, జిల్లెళ్ళమూడి అమ్మతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఆ రోజుల్లో రామాల్ ప్రభు ధ్యానసంపద్రాయం ఒకటి ఉంది. గుంటూరులో మోతడక సత్యనారాయణ గారనే ఒక Town Planning Officer ఉండేవారు. ఆ సంప్రదాయంలో ఆయన మాస్టర్గా ఉండేవారు. ఆయన దగ్గర శిష్యుడుగా చేరాడు ఈయన. దాంట్లో ధ్యానం చేస్తుండగా కృష్ణభిక్షువుకు Third Eye Open అయింది. ఏవైనా ఆధ్యాత్మిక విషయాలు, ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే కృష్ణభిక్షువుగారినే చూడమనే వారు గురువు గారు. వారు చూడమంటే ఈయనకు కనిపించేది. ఆ గురుశిష్యు సంబంధం అట్లా ఉండేది. తర్వాత వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు.

జిల్లెళ్ళమూడి అమ్మను గురించి విని, వీరిద్దరూ శిష్యులతో కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సత్యనారాయణగారు కృష్ణభిక్షువును ‘అమ్మ యొక్క జన్మ పరంపరను చూడవలసింది’ అని కోరారు. ఈయన చూశారు. ధ్యానంలో వారికి కనిపించినవి చెప్పారు. ఏదో దివ్యలోకాలలో హ్రీదేవి అని, అట్లా కొన్ని జన్మ పరంపరలు చెపుతూ వచ్చారు. ఆ తర్వాత కూడా దానిని గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నాం. తర్వాత అమ్మను కొందరు అడిగారు. ‘కృష్ణభిక్షువు చెప్పినది సత్యమేనా?’ అని. “ఆయన కనిపించినవి చెప్పాడు” అన్నది అమ్మ. కృష్ణభిక్షువుకు అమ్మను గురించి ప్రబలమైనటువంటి విశ్వాసం కలిగింది. ఆయన చూసినటువంటి ధ్యానం వలన ఆమెను అవతారమూర్తిగా, పరమేశ్వరిగా, అనేక జన్మపరంపరలు లోకకల్యాణం కోసం ఎత్తినటువంటి ఒక మహావ్యక్తిగా ఆయన భావించారు. ఆ రోజుల్లో అంతా కలిసి ధ్యానం చేస్తూండే వాళ్ళం.

మొదట అంతా కలసి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. భోజనాలకు రెండు పంక్తులలో కూర్చున్నాము. ఇంతమంది ఉండగా నా వద్దకే అమ్మ వచ్చి, నాకు ఎదురుగా కూర్చొని, అన్నం కలిపి ముద్దలు పెట్టింది. ఆ సంఘటన వల్ల ఆమె ప్రేమ, వాత్సల్యం మనస్సుకి బాగా హత్తుకున్నది. అంతకు ముందు అంతా అక్కడ కూర్చున్నాము. అప్పటి ఒకటి రెండు సంఘటనలు ఉన్నాయి. మిన్నికంటి గురునాధ శర్మగారు గొప్ప పండితులు, శాస్త్రవేత్త. ఆయన వేదాంతానికి సంబంధించిన ఒక ప్రశ్న అమ్మను వేశారు. ఆమె చూస్తూ ఉన్నది. ఇంతలో ఎవరో పెద్ద లావాటి వేదాంత గ్రంథాన్ని తీసికొచ్చి అమ్మకు ఇచ్చారు. ‘అమ్మా! ఈ వేదాంత గ్రంథం అచ్చయింది. మీకు సమర్పిద్దామని తెచ్చాను’ అన్నారు. మాతో మాట్లాడుతున్నది, ఆ గ్రంథం తిరగేస్తున్నది. తిరగేస్తూ ఒక చోట ఆగి “నాన్నా! ఇది చదువు” అన్నది నన్ను. నేను ఆ పేజీ చదివాను. ఆయన ప్రశ్నకి సమాధానం దాంట్లో ఉంది. ఆ పుస్తకం అమ్మ అంతకు ముందు చూడలేదు. ఏ పేజీలో ఏముందో చూడలేదు – లౌకికంగా చెప్పేటట్టయితే, అప్పుడే పుస్తకం మా ఎదురుగానే వచ్చింది. ఈయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం అదే పేజీలో ఉండటం ఆశ్చర్యం. గురునాధశర్మగారు చాల దిగ్భ్రాంతి చెందారు ‘ఏమిటి ? ఇది ఎట్లా సాధ్యం’ అని. సాధ్యమా అసాధ్యమా అంటే అతీతమైన విషయాల్లో ఎవరూ చెప్పగలిగింది లేదు. జరిగింది. అంతే. అది ఒక మహిమాన్వితమైన విశేషంగా ఆ పూట అందరూ భావించాం.

తర్వాత కూడా మరొకసారి మేము అందరం కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అలా వెళ్ళినపుడు వేదాంత సంబంధమైన కొన్ని ప్రశ్నలకి అమ్మ చాల simpleగా, అత్యంత క్లిష్టమైన ప్రశ్నలు అని మనం అనుకున్నటువంటి వాటికి ఆమె చాలా సులభంగా, సుబోధకంగా, సరళంగా చెప్పింది; పండు వలిచి పెట్టినట్టుగా ఉండేవి ఆ సమాధానాలు.

అప్పటికి నాకు వివాహం కాలేదు. నాటి సిద్ధేశ్వరీపీఠాధిపతులు శ్రీ త్రివిక్రమానందభారతీస్వామివారు ‘కులపతిగారు ఆశ్రమస్వీకారం చేయొచ్చు కదా! ఈ పీఠానికి రావచ్చు కదా’ అని అడిగారు. ఆ సంగతి పొత్తూరి వేంకటేశ్వరరావు గారు నాకు చెప్పారు. వారు చెప్పిన మీదట నేను ఆలోచించి సన్యాసం తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. అన్ని ఏర్పాట్లు కూడా అనుకున్నాము. శాస్త్రం తల్లిదండ్రుల అనుజ్ఞ కావాలని చెపుతున్నది. కాబట్టి వాళ్ళని అడిగితే ‘పెద్దకొడుకువు. నువ్వువెడితే ఎట్లా?’ అని వారు అంగీకరించలేదు. ఒక వేళ నేనేదైనా తొందరపాటు చర్య తీసుకుంటానేమోనని వాళ్ళు జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను ప్రార్థించారు. అపుడు అమ్మ “మీరెందుకు దిగులు పడతారు? దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడేది జరగాలో అప్పుడు అది జరుగుతుంది” అని చెప్పింది. వారు నిశ్చింతగా ఉన్నారు. అప్పటికి అది వాయిదా పడింది. కుర్తాళం మౌనస్వామిపీఠానికి నేను భవిష్యత్లో వస్తాననే అవగాహన అమ్మకి ఉందేమోననే భావన ఇప్పుడు అనిపిస్తున్నది. జరగవలసిననాడు జరుగుతుంది, అనటంలో అనుబంధం ఏదో ఉంది; నిర్ణయం ఏదో ఉన్నదన్న సంగతి ఆమెకి తెలుసునని అనిపిస్తున్నది.

అమ్మ మీద ‘అంబికాసాహస్ర’, 1000 పద్యాలు, శ్లోకాలు వ్రాశాను. సాధన యొక్క ప్రారంభదశలో ఉన్నవాడిని. అంటే అప్పటికి నిరంతరం ధ్యాన మంత్ర జపదీక్షలు చేస్తూండేవాడిని. రోజూ 15 గంటలు, 16 గంటలు జపం చేయటం, ధ్యానం చేయటం అభ్యాసం చేస్తున్నపుడు – అల్పాహారంతోనో, నిరాహారంగానో చాలకాలం మండలదీక్షలు అవీ చేస్తూండేవాడిని. ఆ సమయాలలో ఈ మంత్రజపం వల్ల నిరంతరం ధ్యానం వల్ల ఏవేవో కొన్ని అనుభూతులు కలుగుతూండేవి. ఇలా చేస్తున్న మంత్రదేవత యొక్క కరుణకు సంబంధించిన దర్శనాలు కొన్ని జరుగుతూ ఉండేవి. ఆ పరంపరలో అప్పుడు కలిగినటువంటి ధ్యానానుభవ పరంపరలలో ఇట్లా అనిపించింది. అమ్మ కూడా అపుడు ధ్యానంలో స్వప్నంలో కనబడటం; స్వప్నంలో కనబడి ఆ రోజుల్లో నాకు ఒక మంత్రం కూడా ఉపదేశించింది. అది శాక్తేయమనిపించింది. సంప్రదాయ ప్రకారంగా వచ్చినదే. నేనెవరికీ చెప్పలేదు. వీటన్నింటిని బట్టి, నాకు కలిగిన అనుభవాలను బట్టి, తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసిన మీదట ఒక ప్రబలమైన విశ్వాసం ఏర్పడటాన్ని బట్టి, పెద్దలు చెప్పిన దానిని బట్టి – మొత్తం మీద ఏమిటి అంటే ఆమె ఒక దివ్యశక్తి, అసామాన్యురాలు, మహనీయవ్యక్తి అనే విశ్వాసం కలిగి ఆ రోజుల్లో ‘అంబికాసాహస్రి’ వ్రాశాను.

అమ్మ సామాన్యంగా 'అం ఆ' అనే రెండు అక్షరాల్ని వ్రాసి ఇచ్చేది. అవి బీజాక్షరాలేనా అని అడిగిన సందర్భంగా .....

అవి బీజాక్షరాలే – అనేకమైనటువంటి జన్మపరంపరలలో ఒక అనంతశక్తి ప్రయాణం చేస్తూన్నప్పుడు అందులో ఏది మనకి ఇవ్వాలని అనుకున్నదో ఏది వికసించాలనుకున్నదో దానికి సంబంధించి నటువంటి ఒక అంశాన్ని మనకి అందించి ఉండవచ్చు.

అమ్మ కుమార్తె హైమతో మీ అనుబంధం ఏమిటి?

అమ్మ కుమార్తె హైమతో కేవలం పరిచయం మాత్రమే ఉంది. అమ్మ దగ్గరకి వెళ్ళినపుడు ఆ అమ్మాయిని చూడటం, పలకరిస్తే మాట్లాడటం, ‘బాగున్నావా అమ్మా!’ అనటం అమ్మ మీద వ్రాసిన పద్యాలు చదవమని అడిగితే చదవటం అంతవరకే తప్ప హైమతో ప్రత్యేక అనుబంధం నాకు లేదు.

హైమాలయాన్ని స్థాపించి, హైమ ద్వారా అమ్మ కొన్ని లౌకికమైన ప్రయోజనాల్ని కలిగించిందా? అన్నపుడు

దైవకార్యములలో ఏది దేని ద్వారా జరగాలో, ఏ మాధ్యమం ద్వారా జరగాలో అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు అలా నిర్ణయించినపుడు ఈ మాధ్యమంగా ఉండేటటువంటి వ్యక్తి శక్తిమంతుడు కావచ్చు కాకపోవచ్చు. వాళ్ళ శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి కూడా కొంతశక్తి కలిగేట్టయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. లేనిపక్షంలోనైనా వాళ్ళ ఇచ్ఛ ప్రధానమైనది. కదా! వాళ్ళ ఇఛ్ఛ అపరిమితమైనటువంటిది. ఆ అపరిమితమైన ఇచ్ఛాశక్తి ఈ జీవిద్వారా పనిచేయడం జరుగుతుంది.

నేను అమ్మతో చర్చించేవాడిని కాదు. చర్చలు చేయడం అలవాటు ఉండేది కాదు. ఏవైనా కొన్ని సందేహాలు లాగ కొన్ని ప్రశ్నలు అడగటం, ఆమె simple గా సమాధానం చెప్పటం. ఏవో ఆధ్యాత్మిక విషయాలు, సాధనల గురించి అడిగేవాణ్ణి. “నాయనా! మంచిదే” అంటూ అలా ఒక అడుగు ముందుకు వేయడానికి తోడుగా సమాధానాలు చెపుతూండేది. ఆమె శరీరంతో ఉన్నప్పటి కంటే తర్వా నేను సాధనల గురించి అడిగింది ఎక్కువ. నేను ఏదో ఈ రంగంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకసారి అమ్మను ఆవాహనం చేశాను. దివ్యలోకాలలో ఉండే మహనీయమైన వ్యక్తులను పిలవటం అనేది. ఎప్పుడైనా పిలవవచ్చు. మనకా తపశ్శక్తి ఉండేట్టయితే వాళ్ళు వస్తారు.. గుంటూరులో నా ధ్యానమందిరంలో కూర్చొని ఆమె చిత్రం పెట్టి, దానికేదో ప్రక్రియ ఉంది, ఆ ప్రక్రియ చేసి ఆమెను ఆవాహన చేశాను. ఆమె వచ్చి నా ఎదురుగా ఉంది. నేనడుగుతూ ఉన్నాను. ‘నా సాధన ముందుకు వెళ్ళాలా, ఎలా వెళ్తుందీ? ఇంకా తపస్సు ఎట్లా చెయ్యాలి?’ అని. ఆమె అన్నది “నాయనా! రోజూ బాగా పదిమందికి అన్నం పెట్టు” అని. ‘అన్నం పెట్టటానికీ తపస్సుకి సంబంధం ఏమిటి? తపస్సంటే – ధ్యానం చేయాలి. ఆహారాది కఠోర నియమాలు, క్షేత్రవాసాలు ఇవన్నీ చేసుకుంటూ పంచాగ్ని మధ్యంలో శీతల జలాలలో… ఎండాకాలంలో అగ్నిమధ్యంలో ఉండి, వానాకాలంలో తడుస్తూ గొంతు లోతు నీళ్ళల్లో నుంచొని – ఇలా చెయ్యాలి కఠోర తపస్సు. మరి అన్నం పెట్టమంటావేమిటమ్మా?’ అన్నాను. “అలా చెయ్యి నాయనా! దానివల్ల కూడా తప్పకుండా వస్తుంది” – అన్నది.

కానీ ఆ సందర్భంలో జరిగిన మరొక సంఘటన మాత్రం చాలా విచిత్రమైనది. మా తమ్ముడు పి.యస్.ఆర్. మనుమరాలు (వాడి కుమారుని కూతురు) మా ఇంట్లో మేడమీద పడుకొని నిద్రపోతున్నది వాళ్ళ అమ్మదగ్గర. సంవత్సరం పిల్ల. నేను ఇక్కడ అమ్మను పిలిచి ఉన్నాను. అమ్మ నా ఎదురుగా ఉన్నది. నేను మాట్లాడుతున్నాను. ఇంతలో మేడమీది నుంచి ఆ అమ్మాయి మెట్లు దిగి నడిచి వస్తున్నట్లుగా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న నా కంటికి కనిపిస్తున్నది. మెట్లు దిగివచ్చింది. వచ్చి అమ్మకు నమస్కారం చేసింది. నేను ఒక ప్రక్క అమ్మతో మాట్లాడుతూనే ‘నువ్వెందుకొచ్చావు? ఎట్లా వచ్చావు?’ అన్నాను. ‘నేను పూర్వజన్మలో అమ్మ భక్తురాలిని. ఆయువు తీరి మరణించాను. ఇప్పుడు ఇక్కడ పుట్టాను. అమ్మ వచ్చిన సంగతి నాకు ఎందుకో తెలిసింది. నేను వచ్చాను. నమస్కారం చేశాను’ అంది. ఆశ్చర్యం కలిగింది. ఒక క్షణం ఉండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మతో సంభాషణ అయింది. ఆమె అదృశ్యమై పోయింది. అపుడు నాకు కలిగిన సందేహం ఏమిటంటే – చిన్నపిల్ల సంవత్సరము పిల్లకు శాస్త్రరీత్యా మనస్సు వికసించి ఉండదు. మాట్లాడేశక్తి లేదు. కాని ఎలా వచ్చింది? అంటే ధ్యానంలో చూశాను. కాబట్టి అది physical గా భౌతికంగా మెట్లు దిగి రావటం కాదు. ఆమె యొక్క astral body (సూక్ష్మశరీరం) దిగి వచ్చింది – అంటే చిన్నపిల్లలకు కూడా భౌతికమైన మనస్సు వికసించకపోయినా ఆ జీవికి ఒక astral body and astral mind ఉంటుంది. అది ఆలోచించగలదు, మాట్లాడగలదు, చూడగలదు. ఏమైనా చెయ్యగలదు – అన్న యోగశాస్త్ర విషయం అప్పుడు ప్రత్యక్షంగా నాకు నిరూపితమైంది. అమ్మ యొక్క దర్శనం వల్ల వచ్చిన పరిణామం ఇది.

“పదిమందికి బాగా అన్నం పెట్టు” అని అమ్మ చెప్పిన దానిని కూడా అమలు చేస్తున్నాను…. మా పీఠంలో, విభాగాలలో, ఆశ్రమాలలో వీలైనంత ఎక్కువ అన్నదానం చేయించడం జరుగుతోంది. అమ్మ చెప్పిన దానిని తప్పకుండా పాటిస్తున్నాను.

అమ్మకి కపాలం లోంచి వెలుగు వచ్చింది. ఆ అమ్మను 'ఛిన్నమస్తక' అని అంటారు. అమ్మకి భృకుటీభేదనం అయి రక్తం స్రవించింది. ఆ రక్తం భస్మంగా మారింది. అని అంటారు కదా! అనగా .....

వీటిని హఠయోగ ప్రక్రియలుగా కొందరు చెపుతుంటారు. కానీ హఠయోగులెవరూ వీటిని సాధించలేదు. దైవానుగ్రహం కలిగినటువంటి ‘మంత్రశక్తివల్ల సిద్ధశక్తి వల్ల మాత్రమే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సిద్ధశక్తి యొక్క వికాసమునకు ఇవన్నీ కూడా చిహ్నాలు. నేను ఛిన్నమస్తక ఉపాసన చేశాను. గణపతి మునీంద్రులకు జీవించి యుండగా కపాలభేదనం జరిగింది.

అమ్మ కపాలం మెత్తగా ఉన్నది. అందరూ చూశారు. దాంట్లోంచి నెత్తురు రావటం కూడా చాలమంది చూశారు. ఎలా వస్తుంది? కపాలానికి ఏదైనా దెబ్బతగిలితే వస్తుంది మాములుగా. దెబ్బ ఏమీ తగలలేదు. ‘ఊరికే తలమీద ఇలా అంటే నెత్తురు తగిలేది’ అని ఆమె చెప్పటం నేను విన్నాను. అక్కడేం గాయాలు లేవు. ‘పట్టుకుంటే మెత్తగా ఉండేది’ అని అంటారు. ఎముక మెత్తగా ఉంటుందా? ఎముక మెత్తబడుతుందా? అంటే ఇది మామూలు విజ్ఞానశాస్త్రానికి, వైద్యశాస్త్రానికి అతీతమైనటువంటి కొన్ని అంశాలేవో ఉన్నవి అనే సంగతి మనకి కనిపిస్తోంది. యోగప్రక్రియలలో కపాల భేదనయోగం, ఖండయోగం ఇలాంటివి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలు కొంతమంది సిద్ధగురువుల యొక్క అనుగ్రహం వలన పొందుతుంటారు. కొంతమందికి దైవశక్తి యొక్క ప్రభావం వలన, ఆ శక్తి వాళ్ళలోకి దిగటం. వలన, ఏ సాధనా లేకుండానే ఇట్లా జరుగుతుంటుంది. అమ్మ ప్రత్యేకంగా ఎవరి వద్ద నేర్చుకోవటమో, ఏదో ఏ సిద్ధగురువు వద్ద ఉపదేశం పొందటమో లేకుండా తనంత తానుగా వచ్చింది.

భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రము ఇవన్నీ కూడా మామూలుగా హఠయోగులు అందరూ చెప్పేవే. కాని అక్కడి నుంచి అలా రక్తం రావటం అనేటు వంటిది మాత్రం అసామాన్యమైనటువంటి ఒక యోగరహస్యము, మహత్వానికి చిహ్నము. మనం ఒక లోబ్సాంగ్ రాంపా చరిత్రలో చూస్తాం. ఆయన సిద్ధగురువులు ఏం చేశారంటే – ఆయనకు దివ్యజ్ఞానం వికసించలేదు, astral vision develop కాలేదు – అని చెప్పి, ఏదో ఒక వస్తువు తీసికొని ఆయన నొసటలో చిల్లి పెడతారు. దాంట్లో ఏదో వస్తువు పెడతారు. ఆ పెట్టిన క్షణం నుంచీ అతనికి దివ్యజ్ఞానం (Third Eye) వికసించింది. ఇది మామూలుగా సాధ్యమా? అక్కడ చిల్లిపెడితే ఏమౌతుంది? దెబ్బతగులుతుంది. గాయమౌతుంది. ప్రమాదమౌతుంది. కానీ యోగంలో అట్లాంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయి.

మౌనస్వామి ఉన్నారు. ఆయన ఖండయోగసిద్ధుడు. గుంటూరులో దర్గాలో మస్తాన్ ఉండేవారు – నల్లమస్తాన్. శరీరఖండాలు పడి ఉండేవి. కుర్తాళంలో మౌనస్వామి సన్నిధిలో అట్లాంటి సంఘటనలు జరిగాయి. ఆయన జీవితచరిత్రలో ఉంది. ఏమిటి అంటే – ఆయన హిమాలయాల నుండి వస్తూ మహనీయులైన అచ్యుతానందస్వామో ఎవరో వారి వద్ద ఆ విద్య పొందారు. పొంది వస్తూ వస్తూ మహారాష్ట్రలో వాసుదేవానంద సరస్వతి మహాయోగి; దత్తాత్రేయుని భక్తుడాయన. మన మండలానికి చెందినవాడు షిర్డీలో సాయిబాబా ఉన్నాడు; వెళ్ళి చూడు’ అన్నారు. అక్కడ కొంతమంది చెప్పేదేమిటంటే షిర్డీ సాయిబాబా, ఈయన ఏవో విద్యలు ఇచ్చి పుచ్చుకున్నారని. ఈయనకు తెలిసిన ఖండయోగాన్ని సాయిబాబాకు నేర్పాడని ఒక సిద్ధసాంప్రదాయంలో చెపుతూండగా నేను స్పష్టంగా విన్నాను. సాయిబాబా దగ్గర ఈయన ఏమి తీసుకున్నాదో ఈయన జీవితచరిత్రలో ఎక్కడాలేదు; తెలియదు మనకు.

నేను అమ్మ మీద ‘ఐంద్రీమహావిద్య అనుపేర’ అనే పద్యం వ్రాశాను. దేవతలందరూ ఏ మహాశక్తి యొక్క విలాసం పొందుతారో ఆ మహాశక్తి యొక్క ఒక రూపము ఒక మహావికాసము ఆమెలో ఉన్నది. ఇపుడు కాశీభక్తులు కాళీ’ అనవచ్చు. ఇంద్రాణీ భక్తులు ‘ఇంద్రాణి’ అనవచ్చు – ఏదైనా అనవచ్చు. ఎందుకంటే ఒక మహాశక్తి ఉన్నప్పుడు, ఆ శక్తి ఎన్ని రూపాంతరాలైనా చెందగలదు. ఎవరికి వారికి తన శక్తి అక్కడ కనిపిస్తుంది. ఇది భక్తి యొక్క లక్షణం. ఆ కేంద్రంలో ఉన్న మహాశక్తి అన్ని రకాలుగానూ కనిపిస్తుంది.

అమ్మ సూక్తులలో ఏదన్నా అంతస్సూత్రం, తాత్త్విక సూత్రం ఉన్నదా?

అనంతమైనటువంటి బ్రహ్మపదార్థం యొక్క విశేషాలను ఆమె సులభంగా మానవజాతికి అందించటానికి ప్రయత్నించింది. దానికి సర్వసమానభావమైనటు వంటి ఆ వాక్కులు సులభం, సుబోధకములైనటువంటి వాక్కుల ద్వారా ఆమె చేసినటువంటి ప్రయత్నం చాలామంది మనస్సులను ఆకర్షించింది. వేదాంతం చదువుకోలేని వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళకు కూడా దాని సారభూతమైనటువంటి వాక్కులు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఆ వేదాంతభావన అందేటట్టుగా పట్టుబడేటట్టుగా చేయడం, అది అమ్మ చేసిన చాల విజయవంతమైన ప్రక్రియ.

సమాధి అయిన అమ్మ ఏ రూపంలో ఉండవచ్చు ? సమస్తం వ్యాపించి ఉండిన మహాశక్తిగా ఉన్నదా? సర్వత్రా వ్యాపించిన శక్తిగా ఉన్నదని భావన చేయవచ్చునా?

శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే ఒక వ్యక్తి ముక్తికి వెళ్ళిపోతే, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లేదు, జీవలక్షణం లేదు, నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. కాని ఆ వ్యక్తి నామంతో పూజిస్తే, అనంతమైన శక్తిగల పరమేశ్వరుడు. ఆ రూపంతో వస్తాడు. ఇపుడు ఈ శక్తి దానితో ఒకటి అయిపోయింది కాబట్టి కలిసి పోయింది కనుక. ఇవాళ ఒక జిల్లెళ్ళమూడి అమ్మ భక్తుడు జిల్లెళ్ళమూడి అమ్మను గురించి అన్నాడనుకోండి. ఆమె ముక్తికి వెళ్ళింది అనుకోండి. ఏమౌతుంది? ఆమె నామాన్నో, మంత్రాన్నో చేసేటటువంటి వాడు ఏమౌతాడు. ఆమె లేదు. శాస్త్ర ప్రకారం ఆమె లేదు అనుకుందాం. ఆమె బ్రహ్మమయురాలై పోయింది – శుకుడు వెళ్ళిపోయినట్లుగా. అంటే ముక్తిలో చాలారకాలున్నాయి. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు చెప్పేటువంటి వాటిల్లో. భగవంతుడున్నాడు. ఏదో శివుడున్నాడు, విష్ణువు ఉన్నాడు; భక్తులు ఆ లోకానికి వెళ్ళగలరు; ఆ రూపాన్ని ధరించగలరు, ఆయన సన్నిధిలో ఉండగలరు, ఆయనలో
కలసిపోగలరు. కలిసిపోయిన తర్వాత వ్యక్తిత్వం లేదింక – శివుడే. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా ఏ దేవతైనా.

అద్వైతులు చెప్పే ముక్తి వేరు. అదేమిటంటే ఈ జీవుడు ప్రకృతిలో కలిసిపోయినాడు –

సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసియై ఒంటివో
వ మహాభీతి నొహో కుమార యనుచున్ వ్యాసుండు జీరంగ వృ
క్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం జేసెమున్నట్టి భూ
తమయున్ కొల్చెద బాదరాయని తపోధన్యాగ్రణిన్ ధీమణిన్.

వ్యాసుడు భాగవతంలో కూడా ఇదే చెబుతాడు –

యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ
పుత్రేతి తన్మయతయా తరవో భినేదుః
తం సర్వభూత హృదయంమునిమానతోస్మి – అని

అంటే శుకుని యొక్క వ్యక్తిత్వం లేదు. శుకుడనే వాడు లేడు, ఆ జీవుడు లేడు. భూతమయుడై పోయినాడు. కనుక ఇపుడెవరైనా శుకుడిని పిలిచేరనుకోండి. అది అంగీకరిస్తే శుకుడురాడు. శుకుడు లేడుగా, చేసింది. వ్యర్థమౌతుందా? ‘జిల్లెళ్ళమూడి అమ్మ అనంత చైతన్యమై పోయింది’ అన్నారు. అనంత చైతన్యమంటే పరమేశ్వరుడు. ఇపుడామెను పిలిస్తే ఎవరొస్తారు? ఆమె లేదుగా? అన్ని నామాలూ అన్నిరూపాలూ అన్నీ తానే అయినటువంటి పరమేశ్వరమూర్తి అయిపోయిందిగా! కనుక ఏం జరుగుతుంది అక్కడ? ఆ అనంత చైతన్యం ఈ రూపంతో ఈ ఆకారంతో వస్తుంది భక్తుల దగ్గరికి. అట్లా కాక రెండోదశ ఏమిటంటే ఆ వ్యక్తి మహాశక్తి సంపన్నమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా తన పేరును తన ఆకృతిని ఆకృతి అనేది వారు సిద్ధశక్తి వచ్చిన తర్వాత ఏ ఆకారాన్నైనా ధరించగలరు; లేకపోతే భక్తులు గుర్తుపట్టడం కోసం వాళ్ళకి తెలిసిన ఆకారంతో కనిపిస్తూంటారు. ఆమె మనకిష్టమైన ఆకారంతో వస్తుంది. ఇంకో రకంగా వస్తే మనం గుర్తుపట్టలేకపోవచ్చు; అందుకని.

సర్వభూతమయమైనటువంటి స్థితి ఒకటి; అప్పుడు ఏమౌతుంది ? అప్పుడు వ్యక్తులను – తపస్సు చేసేటటువంటి వాళ్ళను చాల ఎక్కువ తపస్సు చేస్తే కానీ ఆ అనంత చైతన్యము ఒక ఆకారాన్ని ధరించి రాదు మన దగ్గరకి. కాని ఆ వ్యక్తి కనుక సిద్ధమండలంలో సిద్ధరూపంలో దేవతాలోకంలో ఎక్కడో ఒక చోట ఉండి తన వ్యక్తిత్వం తన జీవలక్షణం ‘నేను’, ‘నేను’, ‘నేను’ అనేటటువంటిది కనుక ఉండేటట్లయితే సులభంగా వస్తారు. ఎందుకంటే ఈ పిలుపు వెంటనే వాళ్ళకి అందుతుంది; పరుగెత్తుకుని వస్తారు.

“నేను నేనైన నేను” – అనే అమ్మ సూక్తిలో శంకరులు చెప్పిన అద్వైత వేదాంతమే ఉన్నది. అన్నీ నేనే: అహం బ్రహ్మాస్మి. నేనే – అన్నీ నేనే. దీంట్లో రెండు వాదాలున్నాయి – బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవడంలో అన్నీ నేనే అనుకుంటూ పోయే వాదం ఒకటి. ఏదీ నేను కాదు అనుకుంటూ పోయేది. ఒకటి; నేతి మార్గం. నేను ఇది కాదు, అది కాదు.

‘నాహందేహో నేంద్రియాణ్యంతరంగః నాహం ప్రాణో నాస్తి కర్మా న బుద్ధిః |
దారాపత్యక్షేత్ర విత్తాదిదూరః సాక్షినిత్య ప్రత్యగాత్మా శివోహం ||’

అది కాదు, ఇది కాదు. నేను ఆ ఒక్కటే పరబ్రహ్మ పదార్థం. రెండవది ఏమిటి? అన్నీ నేనే. నాకు తపోమార్గము నందు, మంత్ర మార్గము నందు, జప హోమాదులు యందు తీవ్రసాధనల యందు ఉన్నంత ఆసక్తి మిగిలిన వాటి మీద లేదు. ఆమెలో ఏ అనంత చైతన్యమున్నదో… ఆమెలో ఒక మహాశక్తి వచ్చింది. ఆ శక్తి ఒక ఆరాధ్యయైన శక్తి. అంతవరకే. ఆమె చెప్పిన మాటలు, బోధలు అర్థం చేసుకుని ఆనందించాను.

సమాజంపై అమ్మతత్త్వ ప్రభావం ఎటువంటిది ?

ఒక వ్యక్తిలో అనంతమైనటువంటి దైవచైతన్యము ఉన్నది అనేటువంటి విశ్వాసము కలిగినప్పుడు మానవ జీవితాలను మార్చేస్తుంది. ఎట్లా మారుస్తుందని అంటే – మనిషిలో ఉండేటటువంటి కాలుష్యము, దుర్మార్గభావనలు, చెడుభావనలు అవన్నీ కూడాను ఆ మహాశక్తి ప్రక్షాళితం చేసేస్తుంది; తొలగిస్తుంది. మనం పురాణాల్లో చదువుతాము. పతివ్రతల కథలు చదువుతాము. మహాశక్తి సంపన్నులై సూర్యుణ్ణి కూడా ఆపగలిగినటువంటి శక్తి కలిగిన పతివ్రతలను చూశాము. భర్తను దేవుడు అని అనుకొని ఉండటం వలన వాళ్ళకశక్తి వచ్చింది. ఆ భర్త నిజంగా దేవుడు కాదు. అయినాసరే. వీళ్ళ భావ తీవ్రతవల్ల వీళ్ళకాశక్తి వచ్చింది.

అమ్మ ప్రభావం వలన ఎంతో మంది మారిపోయినారు. ఎంతోమంది మానవులలో అంతకుముందు లేనిదో లేక నిద్రపోతున్నదో మానవత్వం. వికసించింది. వాళ్ళలో సుప్తమైన చైతన్యాన్ని జాగృతం చేసింది – ఆమె తన చూపు ద్వారా, మాట ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా, తన మహత్వం ద్వారా. అందువల్ల వేలమంది, లక్షల మంది ప్రభావితులైనారు అమ్మ వల్ల. ఆ ప్రభావం ఎట్లాంటి అని అంటే ఉదాహరణకి ఒకడున్నాడు – కఠినుడు; చిన్నప్పుడేదో తల్లి వాత్సల్యానికో తండ్రి ప్రేమకో నోచుకోలేదు. అమ్మ దగ్గర ఆ వాత్సల్యాన్ని చూశాడు. వాడు పాదాక్రాంతుడైపోతాడు. వాడు ఎవడిదగ్గర కాలేదు. ఇంకొకడు అన్నం పెడితే తింటానంటాడా ? నా నోట్లో నువ్వెవడివిరా ముద్ద పెట్టడానికి అంటాడు. కానీ ఆమె పెడితే తింటున్నాడు. ప్రేమతో తింటున్నాడు. ఎందువల్ల? ఆమెలో ఆ దేవతను, మాతృత్వాన్ని, అనంతమైన మానవాతీతమైన ఒక శక్తిని చూసిన విశ్వాసం. ఆ జీవుడితో ఉండేటువంటి అంతకు ముందున్న ఆ తీవ్రభావనలు అసంతృప్తులు తొలగిపోయి సంతృప్తుజీవనుడై శాంతమార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. అట్లా ఎంతోమంది పరిణామం చెందారు. ఆమె వల్ల. అహంకార పూరితులు, దుష్టులు, దుర్జనులు, చెడు భావాలు గల వాళ్ళు అనేకులు మారటానికి ఆమె మహత్తర వ్యక్తిత్వం దోహదం చేసింది. ఆ మార్పు తీసుకు వచ్చింది. మానవులను శిక్షించటం కాదు, మహనీయులైన ఆధ్యాత్మిక వేత్తలు అందులో ఒక బుద్ధుడు గానీ, హరివంశమహారాజ్ గానీ, శంకరాచార్యులు గానీ, రామానుజులు గానీ, మానవులను మార్చడానికి ప్రయత్నించారు. ఆ మార్చడానికి చేసిన ప్రయత్నాలలో ఈ శతాబ్దంలో జిల్లెళ్ళమూడి అమ్మ చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి కృషి అది అనన్య సామాన్య మైనటువంటిది. కొన్ని వేలమందిని ప్రభావితం చేసింది.

నేను కూడా నా సాహిత్యమార్గంలో అంతో ఇంతో తెలిసిన వాడినని అహంకారంతో తిరిగిన వాడినే; పద్యాలు చెప్పి ఆ రంగంలో తిరిగినవాడినే. కాని అమ్మదగ్గరకి వచ్చేసరికి –

లోకమ్ములో నెట్టులుండినగాని నీకడ బాలుడి నిష్ణాయుతుండు.
ఏ చోట ఏ రీతి నెసిగిన గాని నీ చెంత వినయాన నిలుచు నీతండు
బహుజన్మముల నుండి బడలినవాడు, విహితధర్మమ్మున వెలసినవాడు…

అప్పటికేదో జన్మపరంపర కొన్ని విశేషాలు తెలియటం, ఆ తెలియటం కూడా ఆమె పూర్వకాలం నుంచీ ఉన్నది దివ్యలోకాల నుంచి దిగి వస్తున్నదీ ఆమెతో ఎన్నో జన్మల అనుబంధాలు ఉన్నవీ అన్న ఆ దర్శనాలు, అనుబంధాలు, విశ్వాసాలు వాటి అన్నిటి వల్ల

‘బహుజన్మముల నుండి బడలినవాడు, విహిత ధర్మమ్మున వెలసినవాడు, నిను గుండెలో నేడు నిలుపుకున్నాడు, తన నిత్యమాతగా తలుచుచున్నాడు’-

కనుక ‘అమ్మా! నన్ను దయతో చూడవలసినది’ అని అంటూ

‘పల్లవారుణమైన బంగారు బొమ్మ!
జిల్లెళ్ళమూడిలో చెలువొందు అమ్మ!’

అంటూ ఎన్నో వందల వేల సంవత్సరముల స్మృతులు, అనుబంధాలు కాస్త కాస్త ఆ రోజుల్లో గుర్తుకు వస్తుంటే, ఆ భావ తీవ్రత వల్ల నేను వ్రాసినది – అనుకుంటున్నాను. (అంబికా సాహసి) భావావేశంతో వచ్చిన కవిత్వం. అట్లాంటి విశ్వాసాన్ని కలిగించింది. అమ్మ. ఇంత విశ్వాసం ఎందుకు కలిగింది – అని అంటే – నాకు వ్యకితగతమైనటువంటి అనుభవాలు, ధ్యానానుభవాలు. వాటన్నింటితో పాటుగా మహత్తరమైన ఆమె యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, వాత్సల్యం- ఇవీ జీవితం మీద ప్రభావాన్ని చూపించినవి.

మీరు కుర్తాళం పీఠాధిపతి కావటంలో అమ్మ, మౌనస్వాముల నిర్ణయం ఉందా?

మౌనస్వామి – అమ్మ ఒకే భూమికకు చెందిన వాళ్ళు. వాళ్ళ మధ్య అనుబంధాలు ఎప్పుడూ ఉంటయ్. ‘సంవాదిన్యోమేధావినాం బుద్ధయః’ అంటారు. అట్లా దివ్యభూమికల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఋషిపరంపరకు చెందిన వాళ్ళు, సిద్ధమండల సిద్ధాశ్రమాలకు చెందినటువంటి వాళ్ళు – అలాంటి వాళ్ళు. వయస్సులో తేడా ఉండవచ్చు- ఇపుడు – ఆయన తర్వాత తరానికి చెందిన వాడిని; నేను ఆయనను చూడలేదు భౌతికంగా, కానీ ఆయన నాతో చెప్పాడు – మనం 4 వేల సంవత్సరముల క్రితం మొదటిసారి కుర్తాళం వచ్చాము అని. పాత అనుబంధాలు నెమ్మది నెమ్మదిగ గుర్తుచేశాడు ఆయన. అట్లనే అమ్మతో ఆయనకున్న అనుబంధం ఏదో – నాకు ఇద్దరితో ఏర్పడ్డ అనుబంధం – ఎన్ని సంవత్సరముల తేడాతో వచ్చిందో ఇదంతా. ఏవో వాటికి సంబంధించినటువంటి అనుబంధాలు, లింకులు ఏవో ఉంటాయి. కొన్ని తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు ‘ఓహో ఇది కదా’ అనుకుంటున్నాము. అట్లనే అమ్మని గురించి గాని, మరి మౌనస్వామిని గురించి గాని, వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి గాని. ‘ఎవరితో మాట్లాడని మౌనస్వామి అమ్మతో మాట్లాడాడు’ అని అంటేనే దాని ప్రత్యేకత కనిపిస్తున్నది. కనుక మహనీయ వ్యక్తులు వాళ్ళు – మన ఊహకు శక్తికి అతీతమైనటు వంటి వ్యక్తిత్వం వాళ్ళది. అమ్మదీ అట్లాంటిది.

మౌనస్వామి అమ్మతో మాట్లాడటం, నేను అమ్మ దగ్గరకి వెళ్ళటం, తర్వాత నేను సన్యసించి మౌనస్వామి స్థాపించిన కుర్తాళం పీఠాధిపతి కావటం – వీటి మధ్య ఏదో Equation తప్పనిసరిగా ఉంటుంది. ఏమీ సందేహం లేదు దాంట్లో. ఏదో వాళ్ళ మహనీయుల యొక్క ఇచ్ఛ, సంకల్పం – జరుగవలసి యున్నది. అంతే.

నారాయణ – నారాయణ – నారాయణ

Related Interviews …

Sadguru Sri Sivananda Murthy

Sadguru Sri Sivananda Murthy

  సద్గురు శ్రీ శివానన్దమూర్తి   వీరు 21-12-1928 న జన్మించారు. స్వస్థలం రాజమండ్రి. పూర్వీకులు ఉర్లాం జమీందారీ వంశీయులు. తల్లిదండ్రులు శ్రీ వీరబసవరాజు, శ్రీమతి సర్వమంగళాదేవి. భార్య - శ్రీమతి గంగాదేవి. వీరికి ఇద్దరు కుమారులు,...

read more
V S R Moorty

V S R Moorty

  శ్రీ వి.యస్.ఆర్.మూర్తి   వీరు 28.2.1950న జన్మించారు. స్వస్థలం గుంటూరుజిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. తల్లిదండ్రులు శ్రీ వల్లూరు వెంకట నాగభూషణరావు, శ్రీమతి సరోజినీదేవి. భార్య -శ్రీమతి రాజేశ్వరి. సంతానం ఒక కుమార్తె. విద్య...

read more
Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

Bulusu Lakshmi Prasanna Satyanarayana Sastry

  శ్రీ బి.యల్.యస్.శాస్త్రి   వీరు తూర్పుగోదావరి జిల్లా రాజోలులో 9-8-1935న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీ బులుసు సోమనాథశాస్త్రి, శ్రీమతి శేషమ్మ. భార్య- శ్రీమతి శేషవేణి. సంతానం - ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. విద్య- B.A. ఉద్యోగం...

read more
0 Comments
error: Content is protected !!